మరో బ్రహ్మోత్సవాలకు టీటీడీ చురుగ్గా ఏర్పాట్లు
TTD: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రానుండటంతో దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లను చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఈ ఏర్పాట్లను సంయుక్త కార్యనిర్వహణాధికారి వీరబ్రహ్మం పరిశీలించారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజున చిన్నశేష వాహనంపై అమ్మవారు ఊరేగుతారు. 29న పెదశేష వాహనం, హంసవాహనం, 30న ముత్యాలపందిరి, సింహ వాహనం, డిసెంబర్ 1న కల్పవృక్ష వాహనం, హనుమద్వాహన సేవలు జరుగుతాయి.

2న పల్లకి ఉత్సవం, గజవాహనం, 3వ తేదీన బంగారు రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు. సాయంత్రం గరుడ వాహనంపై దర్శనం ఇస్తారు. 4న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహిస్తారు. 5వ తేదీన రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం అశ్వవాహనం, 6న తిరుచ్చి ఉత్సవం, పంచమీ తీర్థాన్ని జరుపుతారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుచానూరుకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఈ ఏర్పాట్లను పరిశీలించారు.
అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్, హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడిరోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భక్తులు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
చివరిరోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలని చెప్పారు. నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, పూడి రోడ్డులో ఉన్న గోశాల వద్ద షెడ్లు వేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications