శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల: లింక్ ఇదే
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 72,072 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 39,384 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.16 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా ఈ ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలకు సంబంధించిన కోటా టికెట్ల విడుదల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ డిసెంబర్ కోటా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన భక్తులకు లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది.
డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతాయి.
డిసెంబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిల్లో వసతి గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
27వ తేదీన తిరుమల- తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆయా టికెట్లన్నింటిని కూడా టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications