తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్, రిలయెన్స్ భారీ విరాళంతో - ఉచితం.. అందుబాటులోకి...!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి తిరుమల లో కృష్ణతేజ అతిథి గృహం వరకు వేచివున్న భక్తులతో క్యూ లైన్ కొనసాగుతుంది శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కాగా.. వచ్చే వారం ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో భక్తుల కోసం కొత్త సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
తిరుమలకు వచ్చే భక్తుల కోసం కీలక నిర్ణయం అమల్లోకి రానుంది. రిలయన్స్ సంస్థ టీటీడీకి 15 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. ఈ బస్సులు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసారు. ఈ బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గతంలో టీటీడీకి 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను విరాళంగా ప్రకటించారు. వీటిల్లో 15 బస్సులు ఇప్పటికే అందించగా.. మిగతా 10 బస్సులు త్వరలోనే తిరుమలకు చేరుకోనున్నాయి. ప్రస్తుతం వచ్చిన బస్సులను త్వరలో ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో ధర్మరధం పేరుతో ఉచిత బస్సులు నడుస్తున్నాయి. ఇక.. ఇప్పుడు ఈ బస్సులు సైతం అందుబాటులోకి రానున్నాయి.

బ్రహ్మోత్సవాల వేళ ప్రారంభం
ఈ బస్సులు అందుబాటులోకి తీసుకు రావటం ద్వారా సామాన్య భక్తులకు ఇక సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లాలన్నా వారికి వెసులు బాటు కలగనుంది. ప్రయివేటు వాహనాలు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న వేళ.. ఈ బస్సులు ప్రయోజనకరంగా ఉంటాయని వివరిస్తున్నారు. ఈ బస్సుల్లో ఉచితంగా తిరుమల శ్రీవారి భక్తులు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఈ బస్సులకు టీటీడీ ఎలక్ట్రిక్ బస్ స్టేషన్లో ఛార్జింగ్ చేస్తున్నారు. అనంత్ అంబానీ ఈ ఏడాది జూన్లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. ఆ బస్సులకు అవసరమైన డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా విరాళంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ బస్సుల్లో భక్తులు ఉచితంగా తిరుమలలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. రిలయెన్స్ సంస్థ ఇచ్చిన 25 బస్సుల్లో ప్రస్తుతం 15 అందుబాటులోకి తెస్తుండగా...మరో నెల రోజుల్లో మిగిలిన పది బస్సులు సైతం వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
