శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 82,628 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,505 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.73 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మూడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- ఈ నెల 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. దీనికి ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటూ ఈ ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. నివేదనలు సమర్పిస్తారు.
అలాగే- శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. 17వ తేదీన తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపైతిరుమాడ వీధులలో విహరిస్తారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని 17న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మిగిలిన ఆర్జిత సేవల్లో ఎటువంటి మార్పు ఉండదు. అవి యధాతథంగా కొనసాగుతాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఈ ఉత్సవాలు నిర్వహించడానికి టీటీడీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తరువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది. అదేవిధంగా ఆగష్టు 17న ఉట్లోత్సవంను పురస్కరించుకొని స్వామి వారికి స్నపన తిరుమంజనం, ఊంజల్సేవను చేపడుతారు. సాయంత్రం ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications