తిరుమలలో బయటి వ్యక్తులు- అనధికార నివాసం: టీటీడీ మెరుపుదాడి
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. సెలవురోజు కావడం వల్ల శనివారం నాడు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. నేడు కూడా రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు భక్తల సంఖ్య కొంతమేర తగ్గినప్పటికీ.. మళ్లీ పుంజుకొంది.
శనివారం 77,807 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 38,340 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.02 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. భక్తులతో కిటకిటలాడాయి. ఏటీజీహెచ్ సర్కిల్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.
కాగా తిరుమలలో కొందరు బయటి వ్యక్తులు అనధికారికంగా నివసిస్తోన్నారు. టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం అధికారులు, స్థానిక పోలీసులు తిరుమల బాలాజీ నగర్ వెనుక భాగంలో ఉన్న కార్మికుల నివాసాలపై దాడులు నిర్వహించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలో తిరుమలలో వివిధ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేసిన కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ పనులు పూర్తయి, కాంట్రాక్టర్ వెళ్లిపోయినప్పటికీ, చాలా మంది కూలీలు ఇప్పటికీ తిరుమలలోనే నివసిస్తోన్నారు. 70కి పైగా షెడ్లను వేసుకుని అక్కడే ఉంటోన్నారు. ఇందులో కొంతమంది అనధికార వ్యక్తులు కూడా ఉన్నారు.
తిరుమల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్ అధికారులు ఆదివారం నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కార్మికుల జాబితా ధృవీకరణ కోసం ఇంజినీరింగ్ విభాగానికి పంపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, అనధికారికంగా నివసించే వారిని అడ్డుకోవడంలో భాగంగా ఇకపై ఇలాంటి దాడులు నిరంతరాయంగా నిర్వహిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న వ్యక్తులు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బయటి వ్యక్తులు అనధికారికంగా తిరుమలలో షెడ్లను వేసుకోవడం, అక్కడ నివసించడం సరికాదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications