శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 64,766 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,158 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.09 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పట్టింది. నాలుగు కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. మున్ముందు భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

ఈ ఏడాది ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా, వసతి గదుల టికెట్ల విడుదల తేదీలను టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు దశలవారీగా ఒక్కో సేవ టికెట్లను ఆన్లైన్లో పొందుపరుస్తారు.
ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఆ సొమ్మును చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. గడువులోగా డబ్బులు చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటా విడుదల కానున్నాయి.
23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. అదే రోజున శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. 23వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు టీటీడీ అధికారులు. అదేరోజున మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో పొందుపరుస్తారు.

25వ తేదీన ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టకెట్లను టీటీడీ అధికారులు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటా విడుదల అవుతాయి. తిరుమల, తిరుపతిల్లో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
27వ తేదీన ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటా, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో వస్తాయి. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications