చికిత్సకు వెళ్తే ముఖాన్ని కాల్చేశారు: వైద్యుల అరెస్ట్
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖంపై అవాంఛిత రోమాలు తొలగిస్తామని చెప్పి ఏకంగా ముఖాన్నే కాల్చేయడంతో ఆమె తీవ్రగాయాలతో మరో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు.
మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన భరత్ రెడ్డి, చందనారెడ్డి దంపతులు ప్రస్తుతం మాదాపూర్లో నివాసం ఉంటున్నారు. ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు తొలగించుకునేందుకు చందనారెడ్డి(35) జూన్ 18న మాదాపూర్లోని రీషెవ్ స్కిస్ కేర్ క్లినిక్కు వెళ్లారు.
లేసర్ ట్రీట్మెంట్ ద్వారా తొలగించేందుకు చికిత్సకు రూ. 18వేలు ఖర్చవుతుందని, ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని, మూడు విడతల్లో పూర్తి ఫలితం కనిపిస్తుందన్నారు ఆస్పత్రి వైద్యులు.

చందనారెడ్డి ముందస్తుగా రూ. 11వేలు చెల్లించడంతో అదే రోజు సాయంత్రం వైద్యుడు కొండారెడ్డి చికిత్స నిర్వహించారు. రోమాల తొలగింపునకు సాధారణ స్థాయి కంటే అధిక శాతం వేడితో ఎల్ఓపి పరకరం ఉపయోగించడం వల్ల చందనారెడ్డి ముఖం కాలిపోయింది. బుగ్గలు పూర్తిగా కమిలిపోవడంతో పాటు గడ్డం కింద భాగం మొత్తం నల్లటి మచ్చలతో ఉబ్బిపోయింది.
చందనారెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు కొండారెడ్డి, ఆస్పత్రి ఎండి కిరణ్ కుమార్ను చందనారెడ్డి కుటుంబసభ్యులు నిలదీశారు. ఆస్పత్రి యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారు జూన్ 19న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.












Click it and Unblock the Notifications