గుంటూరు: భవనం కూలి ఇద్దరు మృతి, వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
అమరావతి: గుంటూరు పట్టణంలో ఒక పురాతన భవనం కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
స్థానికి రైలుపేటలోని సరస్వతి థియేటర్ సమీపంలో ఉన్న ఓ పాత భవనం ఉంది. ఆ పాత భవనం పైకప్పు మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కూలింది. దీంతో ఈ బిల్డింగ్లో అద్దెకు ఉంటున్న అంజమ్మ (70), ప్రదీప్ (3) మృతి చెందారు.
ఈ ఘటనలో మరో ముగ్గురు సుధారాణి, లోహిత, శివలక్ష్మి గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ పాత భవనాన్ని గతంలోనే కూల్చాలంటూ కార్పోరేషన్ అధికారులు నోటీసులిచ్చారు.
అయితే, ఈ పురాతన భవనం ఆస్తి తగదాల్లో భాగంగా కోర్టులో ఉండటంతో కూల్చేందుకు ఆలస్యమైంది. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అంతా దిగ్ర్బాంతికి గురయ్యారు.
గుంటూరులో వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
పాత గుంటూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాత గుంటూరులో స్థానిక యాదవుల బజారులోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగారావు విగ్రహాన్ని గత అర్ధరాత్రి ఆగంతకులు ధ్వంసం చేశారు.
మంగళవారం ఉదయం గుర్తించిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి... వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రహదారిపై బైఠాయించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.