ఆటోనగర్లో ఆయుధాల తయారీ: పోలీసుల తనిఖీ, అరెస్ట్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఆటోనగర్లో ఆయుధాల తయారీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఆటోనగర్లోని స్ప్రింగులు తయారు చేసే లక్ష్మీదుర్గా ఇంజనీరింగ్ వర్క్స్పై ఏలూరు పోలీసులు దాడి చేశారు. అక్కడ తుపాకుల క్యార్ట్రిడ్జిలు, బుల్లెట్లు, ఇతర పరికరాలు భారీ ఎత్తున పట్టుబడ్డాయి.
వారం రోజుల క్రితం నెల్లూరు ప్రాంతానికి చెందిన శరత్ రెడ్డి అనే బీటెక్ విద్యార్థిని పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని విచారించగా.. విజయవాడలో ఆయుధాలు తయారీ వ్యవహారం మొత్తం బయటపడింది.
దీంతో ఏలూరు నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడ ఆటోనగర్కు వచ్చి.. ఇక్కడ తనిఖీ చేయగా ఆయుధాల తయారీ గుట్టు బయటపడింది. ఇక్కడ తయారు చేసిన ఆయుధాలను మావోయిస్టులకు చేరవేస్తున్నట్లు పోలీసులు తేల్చారు.
కాగా, లక్ష్మీదుర్గా ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని శివనాగరాజును, ఆంటోనీ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగితా వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు వారిని విచారిస్తున్నారు.