TTD: తిరుమలలో కాటేజీల వద్ద చిరుతల కలకలం - టీటీడీ తాజా నిర్ణయం..!!
Tirumala: తిరుమలలో చిరుతల సంచారం కొనసాగుతోంది. ఇప్పటికే అయిదు చిరుతలను బంధించారు. ఇప్పటి వరకు నడక మార్గంలో చిరుతలను గుర్తించగా, ఇప్పుడు తిరుమలలోనే ఒక చిరుత సంచరిస్తున్న ట్లుగా ఏర్పాటు చేసిన కెమేరాల ద్వారా అధికారులు గుర్తించారు. దీంతో, యంత్రాంగం అప్రమత్తమైంది. చిరుతలను బంధించేందుకు ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో టీటీడీ మరిన్ని కీలక నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించింది.
తిరుమలలో కాలి నడక మార్గంలో ఇప్పటి వరకు అయిదు చిరుతలను అధికారులు బంధించారు. ఈ ఉదయం తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. అయితే, తాజాగా నరసింహస్వామి ఆలయంలో చిరుత సంచరించటాన్ని అధికారులు కెమేరా ద్వారా గుర్తించారు. అదే విధంగా తిరుమలలో స్పెషల్ టైపు కాటేజీల వద్ద చిరుత సంచారం ఉన్నట్లుగా అక్కడ ఏర్పాటు చేసిన కెమేరాల్లో రికార్డు అయింది. దీంతో చిరుతలను ట్రాప్ చేయటానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో నడక మార్గంలో ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించారు.

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందన్నారు. రెండు నెలల్లో చిక్కిన ఐదవ చిరుత అన్ని తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో, దాదాపు 300 మంది అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందని చెప్పారు. ఈ కారణంగానే ఐదవ చిరుతను ఈ రోజున పట్టుకోవడం జరిగిందన్నారు. మరింత అప్రమత్తతో నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని, వారితో పాటు తోడుగా భద్రత సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు చేసామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం నిన్నటి నుంచి చేతి కర్రలు కూడా ఇవ్వడం ప్రారంభించామన్నారు. భక్తులకు భద్రతా సిబ్బంది తోడుగా ఇచ్చి, అదనపు భద్రత కల్పిస్తూనే అదనంగా కర్రలు ఇస్తున్నట్లు కరుణాకర రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications