కొడాలి నానికి బిగ్ షాక్! బెడిసికొట్టిన కామెంట్స్, చిక్కుల్లో మాజీ మంత్రి!
ఏపీ రాజకీయాలు ఎంత సున్నితంగా మారాయంటే ఇటీవల మనం చూస్తున్న చిన్నచిన్న అంశాలే ఉదాహరణ. ఏవైపు నుంచి ఎవరిపై ఎటువంటి కేసులు పడతాయో చెప్పలేని స్థితికి వచ్చింది రాష్ట్రంలో తీరు. సోషల్ మీడియా వేదికలైనా, మీడియా సమావేశాలైనా ఒక్కమాట అందరితో సాదాసీదాగా మాట్లాడినట్లు మాట్లాడితే వెంటనే కేసులు పెడుతున్నారు. ఇటీవల యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారగా.. ఆయనకు సంఘీభావం తెలుపుతూ వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో నెట్టాయి.
విజయవాడ వన్టౌన్ పీఎస్లో కొడాలి నానిపై ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ హేళన చేశారని, ఈ నేపథ్యంలో చట్టాలపై గౌరవం లేకుండా మాట్లాడినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కంప్లైంట్ లో కోరారు.

అసలు కొడాలి నాని ఏమన్నారంటే..
"ఏడాదిగా పవన్ కళ్యాణ్ను ప్రశ్నించినందుకే ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేశారు. మాది 'గొడ్డలి పార్టీ' అని చంద్రబాబు అంటుంటే.. ప్రజలు మాత్రం మీ పార్టీని 'బూడిద పార్టీ' అని మాట్లాడుకుంటున్నారు. మీరు గమనించినట్లైతే ప్రశ్న రావణ్ ను ఉప్మా చట్టమో.. ఇడ్లీ చట్టమో తీసుకువచ్చి అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అతను మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా మాట్లాడినవి కావు. రావణ్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తి. ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తుంటారు. అందుకే ఆయన ఎప్పుడూ టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీడీపీ సోషల్ మీడియా అసత్య కథనాలతో రావణ్ను వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై రావణ్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ, ఆయనపై అణచివేత చర్యలకు మేము పాల్పడలేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారిని గానీ, మా పార్టీ నేతలు గానీ రావణ్ విమర్శలను భరించామే తప్ప.. ఆయనపై అక్రమ కేసులు పెట్టలేదు" - కొడాలి నాని, మాజీ మంత్రి.
నేతల మాటలే చేటు..
గత వైసీపీ హయంలో మంత్రులు టీడీపీ, జనసేన నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడారని, అధికారం దూరం అవ్వడానికి వారు మాట్లాడిన తీరు కూడా కారణం అని ఇప్పటికి ప్రజల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇటీవలే ఇలాంటి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పాలనాపరమైన విమర్శలు హుందాగా ఉండాలని సూచించారు. దుర్భాషలాడితే చట్టప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు.
కానీ ప్రస్తుతం కూటమి నేతల మాట తీరు సైతం అలాగే ఉందని ప్రజలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొందరు నేతలు అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తుందనే చెప్పాలి. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై, మడకశిర ఎమ్మెల్యే నాకొ** అంటూ చేసిన కామెంట్స్ ఈ చర్చను మరింత పెంచాయి. "వైసీపీ నేతలు నోరు జారారు సరే.. మీరు కూడా కంట్రోల్ తప్పుతారా?" అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా పెద్దల సామేత "నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని" అనేది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఒక వేళ నోరు జారితే ఊచలు లెక్కపెట్టాల్సిందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.














Click it and Unblock the Notifications