గ్యాంగ్ రేప్ ఘటన: పోలీసులమంటూ పిల్లలు బెదిరిస్తే.. తండ్రులేమో..
విశాఖ మన్యంలో తాజంగిలో ఇద్దరు ఆదివాసీ గిరిజన బాలికలపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం కలకలం రేపింది.
చింతపల్లి: విశాఖ మన్యంలో తాజంగిలో ఇద్దరు ఆదివాసీ గిరిజన బాలికలపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. ఆదివారం ఈ ఉదంతం వెలుగుచూసినా పలు సందేహాలు నెలకొన్నాయి. అయితే సోమవారం బాధిత బాలికలు స్వయంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం, నిందితుల్లో స్థానికంగా ప్రముఖులైన వారి కుమారులు ఉండటం సంచలనం కలిగించింది.
చింతపల్లి తరువాత అత్యధిక జనాభా కలిగిన అనధికార మేజరు పంచాయతీ తాజంగి. ఇక్కడ జనాభా అధికంగా ఉండటంతో ఏ పండుగలైనా అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈనెల 18నుంచి 20వ తేదీ వరకు గ్రామంలో పోతురాజుబాబు జాతర నిర్వహించారు.
వర్షంలో తలదాచుకుందామని వస్తే...
చివరి రోజైన శనివారం వేడుకలను చూసేందుకు లంబసింగి పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ గిరిజన బాలికలు, వారి బంధువులైన పాంగి బుజ్జిబాబు, మువ్వల ఉమామహేశ్లతో కలసి తాజంగికి వచ్చారు. అదే రోజు రాత్రి ఈదురుగాలులుతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం జరగలేదు. వర్షం నుంచి తలదాచుకునేందుకు ఇద్దరు యువతులు, వారి బంధువులతో కలసి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వెళ్లారు. అప్పటికే సమయం అర్ధరాత్రి 12.30 గంటలు కావస్తోంది. ఆశ్రయం కోసమని చీకట్లో పాఠశాల ప్రాంగణంలోకి చేరుకుంటున్న బాలికలను గమనించిన కొందరు యువకులు వారిని అనుసరించారు. వారూ పాఠశాలలోకి ప్రవేశించారు.
పోలీసులమంటూ బెదిరించి...
తాము పోలీసులమంటూ చెప్పి ముందుగా బాలికల బంధువులైన ఆదివాసీ యువకులపై దురుసుగా ప్రవర్తించారు. వారివద్ద ఉన్న మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. వారు ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో, ‘పోలీసులపైనే తిరగబడతారా..' అంటూ మూకుమ్మడిగా దాడిచేసినట్టు బుజ్జిబాబు, ఉమామహేశ్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తమను కొట్టుకుంటూ కొందరు వ్యక్తులు బయటకు తీసుకువెళ్లి ఓ చోట నిర్బంధించగా, మరికొందరు దుండగులు బాలికలపై అత్యాచారం జరిపినట్టు వారు పేర్కొన్నారు. వారి అఘాయిత్యాన్ని తాము తిరస్కరించడంతో తమపైనా దాడికి పాల్పడి గాయపరచినట్టు బాధిత బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
విలేకరులు ఆరా తీయడంతో...
అత్యాచారానికి గురైన బాలికలు ఓ మారుమూల గ్రామానికి చెందిన వారు కావడంతో ఈ ఘోరం శనివారం అర్ధరాత్రి జరిగినా వెలుగులోకి రాలేదు. ఆదివారం పత్రికా విలేకరులు వారి గ్రామానికి వెళ్లి ఆరా తీయడంతో సోమవారం పత్రికల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తం ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు.
పరువు పోతుందని.. ప్రలోభానికి యత్నించి..
నిందితుల్లో తాజంగి గ్రామంలో ఎంపీటీసీ సబ్యుడు కోరాబు అంగధరావు కుమారుడు వరుణ్, మరొకరు గూడెంకొత్తవీధి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న లోచల గణేష్ కుమారుడు నాగేంద్ర ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. తాజంగి గ్రామానికి చెందిన వీరు స్థానికులు కావడంతో తమ పరువు పోతుందని చెప్పి విషయాన్ని గోప్యంగా ఉంచాలని, రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామంటూబాధితులను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారు.
ప్రజాప్రతినిధుల చొరవతో...
చివరకు విషయం పెద్దది కావడంతో లంబసింగి, తాజంగి పంచాయతీ సర్పంచులు కొర్రా రఘునాథ్, రామస్వామి, కాంగ్రెస్ నాయకులు వంతల సుబ్బారావు, గిరిజన సంఘం నాయకులు చిన్నయ్యపడాల్, పాంగి ధనుంజయ్ తదితరులు బాధితుల పక్షాన అండగా నిలిచారు. వారికి తెలుగు రాకపోవడంతో కువి భాషలో మాట్లాడి ధైర్యం చెప్పి వారితో పోలీసులకు ఫిర్యాదు ఇప్పించేలా ప్రోత్సహించారు. దీంతో ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం బాధిత బాలికలు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో చింతపల్లి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రాథమికంగా ఇద్దరు.. మిగిలిన వారి కోసం..
ఈ ఘోరంపై చింతపల్లి పోలీస్స్టేషన్లో సీఐ చంద్రశేఖరరావుతో కలసి డీఎస్పీ అనిల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మైనార్టీ తీరని బాధిత యువతులను నిర్భంధించి పోలీసుల పేరు చెప్పి వారిని బెదిరించి అత్యాచారం చేసిన సంఘటనలో ప్రాథమికంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద బలమైన కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఇతర నిందితులను కూడా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపించినట్టు డీఎస్పీ తెలిపారు.
బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ
తాజంగిలో అత్యాచారానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన బాధితుల్లో ఒకరి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీస్స్టేషన్లో పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్టు తెలిపారు. నిందితులపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించి బాధితులకు తగిన న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వ పరంగా బాధితులకు రావాల్సిన నష్టపరిహారం అందించేందుకు తమ శాఖ పరంగా కృషి చేస్తామని ఎస్పీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
‘ఒత్తిళ్లకు లొంగకుండా దోషులను శిక్షించాలి..'
తాజంగి గ్రామంలో అత్యాచారానికి గురైన ఆదివాసీ గిరిజన బాలికలకు న్యాయం జరగాలని మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నేర చరిత్ర ఉన్నవారిని దగ్గర పెట్టుకుని దిగువస్థాయి పోలీసులు పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు. అలాటివారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యాచారానికి గురయిన బాలికలకు ప్రభుత్వపరంగా పరిహారం చెల్లించాలని, ఒత్తిళ్లకు లొంగకుండా దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.