వివేకాను చంపినట్లుగానే నా భర్తను కూడా చంపేస్తానన్నారు?
తనపై దాడి చేస్తున్న సమయంలో తప్పించుకొని మరో గదిలో దాక్కున్నట్టుగా స్వాతి మీడియాకు వెల్లడించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన తరహలోనే తన భర్తను హత్య చేస్తానని బెదిరింపులకు దిగారంటూ ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన ఇంటికి పరమేశ్వర్ రెడ్డి, ఆయన కొడుకు వచ్చి బెదిరింపులకు దిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు పరమేశ్వరరెడ్డి తనపై ఇష్టమొచ్చిన రీతిలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని, ఈ విషయం గురించి తన బంధువులకు ఫోన్ చేస్తే తన ఫోన్ ను లాక్కొని తనను వెనక్కి నెట్టేశారని దీంతో తాను కిందపడిపోయినట్లు చెప్పారు.
తనపై దాడి చేస్తున్న సమయంలో తప్పించుకొని మరో గదిలో దాక్కున్నట్టుగా ఆమె మీడియాకు వెల్లడించారు. ఇరుగు పొరుగు వారు పరమేశ్వర్ రెడ్డిని పంపించేశారని, స్వాతి తెలిపారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారన్నారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే పరమేశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని, జైలు నుంచి తన భర్త ఉమాశంకర్ రెడ్డి బయటకు రాగానే వివేకానందరెడ్డిని హత్య చేసినట్టుగానే చంపుతామని పరమేశ్వర్ రెడ్డి బెదిరించారని చెప్పారు.

నిన్ను చంపితే నీకు దిక్కెవరని కూడా పరమేశ్వర్ రెడ్డి బెదిరింపులకు దిగారని, తన పిల్లలు హస్టల్ లో ఉంటున్నారని, తమది ఉమ్మడి కుటుంబమని ఆమె తెలిపారు. తమ కుటుంబంలో 15 మంది ఉంటామని, మా కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత అని స్పష్టం చేశారు. తాను ఒక్కదాన్నే ఈ ఇంట్లో ఉంటున్నానని, పరమేశ్వర్ రెడ్డి వచ్చి బెదిరింపులకు పాల్పడడంతో తనకు భయంగా ఉందన్నారు. ఉమా శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయగా చర్లపల్లి జైలులో ఉంటున్నాడు. ఈ కేసును తెలంగాణలోని ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు విచారిస్తోంది. రేపు విచారణకు హాజరుకావాలంటూ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications