ఫలించిన నిరీక్షణ: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134కోట్ల ప్రోత్సాహకనిధులు విడుదల చేసిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను విడుదల చేసింది. ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాల క్రింద ప్రభుత్వం 134 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా కేటాయించారు. ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని, గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాశారు.
ఆ తర్వాత అనేక సందర్భాలలో ఏకగ్రీవ గ్రామ పంచాయతీల ప్రోత్సాహక నిధులపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువగా మారాయి. ఈ క్రమంలో తాజాగా గ్రామ పంచాయతీలో ప్రోత్సాహక నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏకగ్రీవ పంచాయతీల ప్రోత్సాహక నిధులు ఇలా
పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకున్న పంచాయతీలకు, ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ప్రోత్సాహక నిధులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవ పంచాయితీల ప్రోత్సాహకాలు విషయానికొస్తే రెండు వేల వరకు జనాభా కలిగిన పంచాయతీలకు 5 లక్షల రూపాయలు, రెండు వేల నుండి ఐదు వేల వరకు జనాభా ఉన్న గ్రాPRమ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు, ఐదు వేల నుండి పదివేల వరకు జనాభా ఉన్న గ్రామపంచాయతీలకు 15 లక్షల రూపాయలు, 10 వేల కంటే మించి జనాభా కలిగిన పంచాయతీలకు 20 లక్షల రూపాయలను ఇస్తామని ప్రకటించారు.
జగన్ కు పంచాయతీల పోత్సాహక నిధుల కోసం బహిరంగ లేఖ రాసిన సోము వీర్రాజు
ఇక గ్రామ పంచాయితీలకు ప్రోత్సాహక నిధులు ఇస్తామని చెప్పి ఎన్నికలు నిర్వహించి 9 నెలలు దాటిన ప్రోత్సాహక నగదు అందలేదన్న విషయాన్ని సరిగ్గా నెల క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్మోహన్ రెడ్డి కి రాసిన బహిరంగ లేఖలో వెల్లడించారు. అంతేకాదు ఆ లేఖలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2199 పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటే ఇప్పటి వరకూ కనీసం నయాపైసా ప్రోత్సాహం కూడా అందించలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
మాట తప్పను మడమ తిప్పననిచెప్పేఏపీ సీఎం జగన్ పంచాయతీలకు ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి ద్వారా మాత్రమే దేశ అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు . ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గమనిస్తే చిత్తశుద్ధి కరువైందని స్పష్టంగా తెలుస్తోందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
జగన్ ను టార్గెట్ చేసిన నారా లోకేష్ .. ప్రోత్సాహకాల విడుదలకు డిమాండ్
ఆ తర్వాత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పంచాయతీ నిధుల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు పంచాయతీ నిధులను దారి దోపిడీ దొంగలు మాదిరిగా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడిన ఆయన రాజకీయ ఆధిపత్యం కోసం ప్రకటించిన ఏకగ్రీవ పారితోషికాన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలను మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామానికి సర్పంచ్ కూడా అంతే అని గ్రామ పంచాయతీల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2199 గ్రామ పంచాయితీలకు ప్రోత్సాహక నగదు 134 కోట్ల రూపాయలు విడుదల
ప్రతిపక్ష పార్టీల నుంచి ఒత్తిడి పెరగడంతో పాటుగా, గ్రామ పంచాయతీ నిధుల కోసం ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవమైన 2199 గ్రామ పంచాయితీలకు ప్రోత్సాహక నగదు 134 కోట్ల రూపాయలు అవసరం అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఫైనల్ గా పంచాయతీలు ఏకగ్రీవం అయిన పది నెలల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం వారికి ఇస్తామని చెప్పిన ప్రోత్సాహక నగదును అందజేసింది.