రాష్ట్ర విభజనను జరగనిచ్చే ప్రసక్తే లేదు: ఉండవల్లి
రాజమండ్రి: రాష్ట్ర విభజనను రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా తప్పు పట్టారు. దేశఁలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉందా అని ఆయన అడిగారు. తల్లిని బిజెపి పట్టుకుంటే, కాంగ్రెసువాళ్లు చంపేశారని ఆయన అన్నారు. తల్లి చచ్చిపోలేదని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన అన్నారు. జై సమైక్యాంధ్ర నినాదం ఢిల్లీవాళ్లకు వినిపించలేదని, వారికి కెసిఆర్ అందంగా కనిపించారని ఆయన అన్నారు. పార్టీ జెండాను కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాజమండ్రి సభలో ఆవిష్కరించారు. ఆ సభకు అధ్యక్షత వహించిన ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం సాయంత్రం తనదైన శైలిలో మాట్లాడారు. 175 మంది శాసనసభ్యులు విభజనకు వ్యతిరేకంగా నిలబడాలని ఆయన అన్నారు. సీమాంధ్ర మొత్తం పార్లమెంటు సభ్యులు 25 మంది విభజనకు వ్యతిరేకంగా నిలబడాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరగగానే కెసిఆర్ చేయిచ్చారని, దాంతో కాంగ్రెసు వాళ్లు ఏడుస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం విభజన అని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ చేయకుండా రాష్ట్రాన్ని విడదీయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. విభజన మళ్లీ విభజన శాసనసభకు రావాల్సిందేనని, శాసనసభ అంగీకరిస్తేనే విభజన జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను జరిగనిచ్చే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు పిటిషన్ను స్వీకరించే వరకు కొనసాగాలని కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, సుప్రీంకోర్టు విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించకుండా ఏమీ చేయలేవని, అందుకే ఆ తర్వాతే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. తలుపులు వేసుకుని లోకసభలో తెలంగాణ బిల్లును ఆమోదించారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తెలుగోడి సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన చెప్పారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే సమైక్యాంధ్ర పార్టీ అని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. ఒక వైపు మాత్రమే చూసి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెసుకు అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. తెలుగుప్రజల గుండెచప్పుడే సమైక్యాంధ్ర పార్టీ నినాదమని ఆయన అన్నారు.