ycp నుంచి పవన్ కల్యాణ్కు అనూహ్య మద్దతు?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్న జనసేనాని పవన్ కల్యాణ్కు అనూహ్యంగా ఆ పార్టీ నుంచి మద్దతు లభించింది. పదోతరగతి విద్యార్థుల పరీక్షాల ఫలితాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్న పవన్కల్యాణ్ ఉత్తీర్ణులు కాని విద్యార్థులందరికీ గ్రేస్ మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మ ఒడి ఎగ్గొట్టడానికే విద్యార్థులను కావాలని ఫెయిల్ చేశారంటూ పవన్ మండిపడుతున్నారు.
తాజాగా ఆయన చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నుంచే మద్దతు లభించింది. ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు తప్పంతా ప్రభుత్వానిదేనంటూ మీడియా ముందుకు వచ్చారు. పవన్కల్యాణ్ డిమాండ్ చేసినట్లుగానే ఉత్తీర్ణులు కాని విద్యార్థులందరికీ గ్రేస్ మార్కులు కలపాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన అధ్యక్షుడు, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల్లో పదోతరగతిలో 83 శాతంకన్నా తక్కువ ఫలితాలు ఏనాడూ రాలేదని, ఇప్పుడు 67.26 శాతమే ఉత్తీర్ణత ఉండటమనేది ఒక అధ్యాపకుడిగా చాలా బాధకలిగిస్తోందన్నారు.
పరీక్ష ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన మోడల్ పేపర్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని, ఉత్తీర్థత శాతం తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషించారు. కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడంలేదని దాడి తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అదే సమయంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా పదోతరగతి ఫలితాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో విశాఖపట్నం జిల్లా వైసీపీలో కాక రేపుతోంది.