తృణమూల్ కు ఈడీ భారీ షాక్..! ఆ ఖాతాల్లో ఏకంగా రూ.440 కోట్లు ఫ్రీజ్ ..!
పశ్చిమబెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత తిరిగి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress)ని ఎట్టి పరిస్ధితుల్లో లేవనీయకుండా చేసేందుకు కేంద్రం ఈడీ సాయంతో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన రూ.440 కోట్లు ఉన్న బ్యాంక్ అకౌంట్లను ఇవాళ ఈడీ ఫ్రీజ్ చేసేసింది. దీంతో మమతా బెనర్జీ పార్టీకి ఈ నిధులు వాడుకునే అవకాశం లేకుండా పోయింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మూడు బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మూడు HDFC బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ. 440.42 కోట్లు ఉన్నాయని ఈడీ పేర్కొంది. పార్టీ నిధుల ద్వారా భారీ స్థాయిలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగాయని, మనీ లాండరింగ్, నిధుల దుర్వినియోగానికి సంబంధించి వీటిపై దర్యాప్తు జరుగుతోందని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ ప్రాంతాలన్నీ విమానయాన రంగంలో కార్యకలాపాలు సాగించే కేర్వెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించినవే.

ఏప్రిల్ 2023, జూన్ 2026 మధ్య కాలంలో తృణమూల్ ఖాతాల నుండి కేర్వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు, దానికి అనుబంధంగా ఉన్న మరో కంపెనీకి సుమారు రూ.160 కోట్లు బదిలీ అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత, కేర్వెల్ ఏవియేషన్ సంస్థ సుమారు రూ.82.96 కోట్లను కొత్తగా ఏర్పాటైన ఒక అనుబంధ కంపెనీ ఖాతాలకు పంపిందని ఈడీ పేర్కొంది. ఈ నిధులలో అధిక భాగాన్ని ఎంబ్రాయర్ లెగసీ 600 విమానం, అగస్టా 109 SP హెలికాప్టర్ కొనుగోలుకు వాడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ రెండింటి కొనుగోలుకు మొత్తం రూ.112 కోట్లు ఖర్చు చేశారు. అగస్టా హెలికాప్టర్ కొనుగోలులో కొంత విదేశీ నిధులను కూడా ఉపయోగించారని, అయితే అందులో ఎక్కువ భాగం నేరుగా తృణమూల్ ఖాతాల నుండే వచ్చాయని కూడా ఈడీ చెబుతోంది. దీనిపై టీఎంసీ ఇంకా స్పందించలేదు.














Click it and Unblock the Notifications