వందే భారత్ను తలదన్నే హైడ్రోజన్ రైళ్లు రానున్నాయ్: ఏపీలో ట్రయల్స్: రద్దీ మార్గాల్లో..!!
అమరావతి: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని రానున్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదించనుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు- రైల్వే బోర్డ్ నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందినట్లు తెలుస్తోంది.

హైడ్రోజన్ రైళ్లు..
అదే సమయంలో వందే భారత్ను మించి పోయేలా హైడ్రోజన్ రైళ్లను కూడా ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. తొలి విడతలో 35 రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా వార్షిక బడ్జెట్ లో పొందుపర్చబోతోన్నట్లు తెలుస్తోంది. రైల్వేలో మౌలిక వసతుల కల్పన, ఆధునికీకరణ, బోగీల సంఖ్యను గణనీయంగా పెంచడానికి 1.9 లక్షల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆధునికీకరణ కోసం..
రోలింగ్ స్టాక్ను ఆధునికీకరించడం, వాటి సంఖ్యను పెంచడం, ట్రాక్ల విద్యుద్దీకరణ, కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్.. మొదలైన వాటి పనుల కోసం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడానికి ఈ మొత్తాన్ని వినియోగించేలా ప్రతిపాదనలను రూపొందిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రద్దీ మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రారంభించింది. దీనికి అదనంగా హైడ్రోజన్తో నడిచే రైళ్లను నడపడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు ఇదివరకే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు కూడా.

ఆసియాలో తొలి దేశంగా..
హైడ్రోజన్ రైళలను ఇప్పటికే చైనా పట్టాలెక్కించింది. ఆసియాలో మొట్టమొదటి హైడ్రోజన్ రైళ్లు ఇవే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి హైడ్రోజన్ రైలును ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది చైనా. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల స్థానంలో వాటిని ప్రవేశపెట్టింది. చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటిని రూపొందించింది.

ఎనిమిది బోగీలు..
సాధారణ రైలు కంటే చాలా చిన్నదిగా ఉంటుంది హైడ్రోజన్తో నడిచే రైలు. ఆరు లేదా ఎనిమిది కోచ్లు మాత్రమే ఉంటాయి. గంటకు 160 కిమీ వేగంతో పరుగులు తీస్తాయి ఇవి. ఒక్కసారి హైడ్రోజన్ ను నింపితే- 600 కిలోమీటర్ల దూరం పాటు రాకపోకలు సాగించగలవు. హైడ్రోజన్ ను ఇంధనంగా వినియోగించడం వల్ల ప్రతి సంవత్సరం 16 లక్షల లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే స్థాయిలో కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి వీలవుతుంది.

ఏపీలో ట్రయల్స్..
తొలి విడతలో 35 రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణాదిన ఏపీ, కేరళ, తమిళనాడులకు ఒక్కో సర్వీస్ చొప్పున కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కేరళకు ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇవ్వలేదు. తమిళనాడు-కర్ణాటక, ఏపీ-తెలంగాణ మధ్య రాకపోకలు సాగించేలా కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను మంజూరు చేసింది కేంద్రం. అందుకే- ఒకే రాష్ట్రంలోని స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించేలా భవిష్యత్తులో హైడ్రోజన్ రైళ్లను కేటాయిస్తుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications