మూడు రాజధానులు సరికాదు-ఒక్కటీ అభివృద్ధి కాలేదు-నిధులేవీ-కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీ చట్టం రద్దు చేస్తూ రెండు చట్టాలు తెచ్చినా హైకోర్టులో చుక్కెదురు అవుతుందన్న అనుమానంతో వాటిని వెనక్కి తీసుకుంది. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మూడు రాజధానులు సరికాదని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే తెలిపారు. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదని గుర్తుచేశారు. మూడు రాజధానులు పెడితే ఎక్కడకు రావాలని అథవాలే ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం మంచిదే కానీ.. దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. విభజన సమయంలోనే రాజధానికి నిధులు ఇవ్వాల్సిందన్నారు. నిధులు లేకే అమరావతి అభివృద్ధి జరగలేదని: రాందాస్ అథవాలే గుర్తుచేశారు.
రాష్ట్ర విభజన సమయంలో నే ఏపీ రాజధాని అభివృద్ధి గురించి నిధులు ఇవ్వాల్సిందని అథవాలే తెలిపారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిని విస్మరించిందన్నారు. ప్రస్తుతం అమరావతి పనులు ఆగిపోయాయని, దీనికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుందని అథవాలే ప్రశ్నించారు. ఏపీలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జగన్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు అథవాలే తెలిపారు. దేశవ్యాప్తంగా 10 శాతం మేర ఈబీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.