రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తోన్న 'ఆ మూడు'?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఉత్తరాంధ్ర చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్రపై పట్టు సాధిస్తే అసెంబ్లీ తమ పార్టీ అడుగుపెట్టినట్లేనని వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు. దీంతో వారి రాజకీయం మొత్తం ఇక్కడే కేంద్రీకృతమైంది. ఈ మూడు జిల్లాల ప్రజలను ఆకట్టుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు.

అమరావతికే మద్దతు పలుకుతున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ అమరావతినే రాజధానిగా ప్రకటిస్తోంది. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తోంది. అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో రెండో విడత ప్రారంభమైన పాదయాత్ర రామచంద్రాపురంలో అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ యాత్ర ఉత్తరాంధ్రకు చేరేసరికి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని విశ్లేషకులు భావించారు. అయితే యాత్ర వాయిదా పడటంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నం, అమరావతి, కర్నూలు మూడు రాజధానులుగా ప్రకటించింది.

అభిమాన గణం ఎక్కువగా ఉన్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మూడు జిల్లాల్లో అభిమానులు ఎక్కువ ఈసారి తన అభిమానుల ఓట్లను గుంపగుత్తగా కొల్లగొట్టాలని పవన్ భావిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు ఈ మూడు జిల్లాలు కలిపి మొత్తం ఐదుజిల్లాలపై జనసేన పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. సాధ్యమైనన్ని సీట్లను ఈ 5 జిల్లాల నుంచే సాధించాలనే లక్ష్యాన్ని జనసేన ఏర్పరుచుకుంది. జనవాణి కోసం పవన్ కల్యాణ్ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. తర్వాత మరోసారి ఆయన విజయనగరం జిల్లాలోని గుంకలాంలో జగనన్న ఇళ్లను పరిశీలించారు. అవినీతి పెద్ద ఎత్తున మేట వేసుకుపోయిందని ధ్వజమెత్తారు.

మూడు రాజధానులకు మద్దతుగా సమావేశాలు
వైసీపీ మూడు రాజధానులకు మద్దతుగా ఇక్కడ మేధావులు జేఏసీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం నేతలు మాత్రం అమరావతికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు కూడా త్వరలోనే శ్రీకాకుళం జిల్లా పర్యటించబోతున్నారు. వైఎస్ జగన్ ఇటీవలే విశాఖ వచ్చి వెళ్లారు. నాదెండ్ల మనోహర్ విజయనగరం సమస్యల పరిష్కారం కోసం చేసే కార్యక్రమాలను రూపకల్పన చేయడంకోసం ఇక్కడే మకాం వేశారు. రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు ఉత్తరాంధ్ర చుట్టూ రాష్ట్ర రాజకీయాన్ని తిప్పుతున్నారు. ఈ మూడు జిల్లాల్లోని ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది తేలేది ఎన్నికల సమయంలోనే. అప్పటివరకు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications