నేటి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ: తిరుపతిలో 90 కౌంటర్లు ఇవే
Tirumala: వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల ముస్తాబు అవుతోంది. లక్షలాది మంది భక్తులు తిరుమలను సందర్శంచనున్నారు. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు ఉత్తర ద్వారం గుండా భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ నెల 23వ తేదీన తెల్లవారుజామున 1.45 నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు టీటీడీ అధికారులు ఉత్తర ద్వార దర్శనాలను నిలిపివేస్తారు. ఈ 10 రోజుల్లో కనీసం 10 నుంచి 12 లక్షలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారనే అంచనాలు ఉన్నాయి.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ ఏవీ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. పలు ఆదేశాలను జారీ చేశారు. క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబరు 22 వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు.
తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నెలకొల్పిన కౌంటర్ల ద్వారా ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు.

ఈ తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు మంజూరు చేస్తారు. ఆయా కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్లను కోటా పూర్తయ్యేవరకు జారీ చేస్తామని టీటీడీ జేఈవో సదా భార్గవి తెలిపారు. ఆయా కౌంటర్ల వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
క్యూలైన్లల్లో వేచి ఉండే భక్తులకు మంచినీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని సదా భార్గవి వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని. ఈ 10 రోజుల పాటు టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications