తిరుమలకు వచ్చే వాహనదారులకు టీటీడీ సూచనలు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,098 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
సర్వదర్శనానికి..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఒక కంపార్ట్మెంట్ నిండింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

టీటీడీ విస్తృత ఏర్పాట్లు..
అటు వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
జిల్లా పోలీసులకు దిశానిర్దేశం..
టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి సోమవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష చేపట్టారు. తిరుమలలో 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబోయే వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై ఆయన పలు నిర్ణయాలను తీసుకున్నారు. జిల్లా పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
వాహనాల రాకపోకలు సజావుగా..
ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో పోలీసుల సమన్వయంతో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికోసం తిరుమలలో ప్రత్యేక పార్కింగ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని చెప్పారు.
కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
కొండపై వాహనాల రాకపోకలు సజావుగా సాగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అదనపు ఈవో అన్నారు. వాహనాల రద్దీని నివారించడానికి పార్కింగ్ స్లాట్లను వికేంద్రీకరించాలని, దాదాపు 13,000 వాహనాల రాకపోకలకు అనువుగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గరుడ సేవ తరహాలోనే రామ్ బగీచా వద్ద ఎక్కువ సంఖ్యలో బగ్గీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
టోకెన్లు ఉంటేనే..
టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు ఉంటాయని వెంకయ్య చౌదరి తేల్చి చెప్పారు. దీనిపై భక్తులకు అవగాహన కల్పించాలని, ఇందులో భాగంగా- రేడియో, బ్రాడ్కాస్టింగ్, సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఎస్వీబీసీ ప్రొమోలు, సూచిక బోర్డుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని వెంకయ్య చౌదరి సూచించారు.












Click it and Unblock the Notifications