తిరుమలలో విరామం లేకుండా అన్న ప్రసాదం వితరణ: టీటీడీ నిర్ణయం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శుక్రవారం నాడు 65,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,297 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లల్లో వేచి ఉండనక్కర్లేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పట్టింది.

కాగా- కలియుగ వైకుంఠం తిరుమల.. వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు వెళ్లొచ్చు గానీ శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం వారికి లభించదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దవుతాయి.
ఈ 10 రోజుల్లో ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది వరకు భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది. క్యూ లైన్లల్లో వేచివుండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేయడానికి అదనంగా శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బందిని అందుబాటులో ఉంచనుంది.
అశేష భక్తజనం కోసం తెల్లవారు జామున 6 నుండి రాత్రి 12 గంటల వరకు విరామం అనేది లేకుండా అన్న ప్రసాదాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నారు టీటీడీ అధికారులు. 6 గంటలకు ఆరంభం అయ్యే అన్నప్రసాదాల వితరణ అర్ధరాత్రి వరకూ కొనసాగించేలా వంటశాలలో అదనపు సిబ్బందిని నియమించనుంది.

భక్తులందరికీ అల్పాహారంగా ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి, టీ, కాఫీ, పాలు అందజేస్తారు. అలాగే- లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు. ప్రతిరోజూ 3.50 లక్షల లడ్డూలను అదనంగా తయారు చేసేలా ప్రణాళికలను రూపొందించుకున్నారు. దీనితోపాటు అదనంగా మూడున్నర లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా సిద్ధం చేసుకోనున్నారు.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లను జారీ చేసే కౌంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. ఎంఆర్ పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో ఉన్న టోకెన్ కేంద్రాల వద్ద అదనంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications