వల్లభనేని వంశీ ఉక్కిరిబిక్కిరి ? కస్టడీ, పీటీ వారెంట్, సిట్ దర్యాప్తు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అప్పట్లో చేసిన తప్పులు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో తాను చేసిన తప్పిదాలు బయటికి రాకుండా చూసుకునేందుకు సొంత పార్టీ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లడమే కాకుండా చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనకు ఇప్పుడు శాపంగా మారిపోతున్నాయి. దీంతో వంశీ పీకల్లోతు కష్టాల్లోకి జారి పోతున్నారు.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ, ఆ తర్వాత ఇదే కేసులో ఫిర్యాదు దారు అయిన దళిత యువకుడు సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులోనూ నిందితుడిగా మారారు. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ ఆయనపై విచారణ కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసి అనుమతి తీసుకుంది. దీంతో ఇవాళ విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని అదుపులోకి తీసుకుని పీటీ వారెంట్ పై కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అదే సమయంలో వంశీ రిమాండ్ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంలో వంశీని మూడు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నిన్న విజయవాడ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో పోలీసులు ఇవాళ ఆయన్ను విజయవాడ సబ్ జైలు నుంచి విచారణకు తీసుకెళ్లనున్నారు. లాయర్ సమక్షంలోనే వంశీ విచారణ జరగనుంది. అదే సమయంలో వల్లభనేని వంశీ భూకబ్జాలపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏలూరు డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. దీంతో సిట్ విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వంశీ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లు అర్దమవుతోంది.
మరోవైపు వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. ఇప్పుడు వరుస విచారణల నేపథ్యంలో వంశీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇందులో ఊరట దక్కితే సరేసరి లేకపోతే వంశీ కష్టాలు రెట్టింపు కాబోతున్నాయి. జైల్లో అదనపు వసతుల కోసం వంశీ చేసిన విజ్ఞప్తిని విజయవాడ కోర్టు మన్నించడం మినహా ఆయనకు ఈ మధ్య కాలంలో ఎలాంటి ఊరటా దక్కలేదు.












Click it and Unblock the Notifications