వంగవీటి రాధాతో పరిటాల శ్రీరామ్ భేటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రంగా, పరిటాల రవిది ప్రత్యేక ముద్ర. వారి వారసులు కూడా ఆ ముద్రను అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిది విజయవాడైతే మరొకరిది అనంతపురం. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న ఈ ఇద్దరు నేతల వారసులు రాజమండ్రిలో భేటీ అయ్యారు. రాజకీయవర్గాల్లో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది.

రెక్కీ సమయంలో రాధాకు మద్దతు తెలిపిన శ్రీరామ్
వంగవీటి రాధాపై దుండగులు రెక్కీ చేసినట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి తామంతా అండగా ఉంటామంటూ పరిటాల శ్రీరామ్ రాధాకు మద్దతు పలికారు. తాజాగా వీరిద్దరితో పాటు లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ కూడా వీరితో సమావేశమయ్యారు. ఈ ముగ్గురు రాజమండ్రిలో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసేందుకు వచ్చారు.

నాలుగో వంతెన మీదగా రాజమండ్రికి చేరుకున్న పాదయాత్ర
రైతులు పాదయాత్ర అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య 36వ రోజు కొవ్వూరు నుంచి ప్రారంభమై నాలుగో వంతెన మీదుగా రాజమండ్రికి చేరుకుంది. పాదయాత్రకు ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిమీదగా రాజమండ్రికి చేరుకోవాల్సి ఉంది. కానీ మరమ్మతుల కోసం కలెక్టర్ వారంరోజులపాటు మూసేయడంతో పాదయాత్రను అడ్డుకోవడానికే ఇలా చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య రాజకీయ వారసులు యాత్రలో పాల్గొనేందుకు ఒకరోజు ముందే రాజమండ్రికి చేరుకున్నారు.

పాదయాత్రలో పాల్గొన్న వారసులు
ఈ సందర్భంగా జరిగిన భేటీలో ప్రస్తుత రాజకీయాలతోపాటు రాయలసీమలో బీఆర్ఎస్ ప్రభావం ఏమైనా ఉంటుందా? అనే విషయంలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ రాధా స్పందించలేదు. దీంతో పార్టీ మారడం ఖాయమని, జనసేనలో చేరుతున్నారంటూ మళ్లీ వార్తలు వచ్చాయి. తాజాగా అమరావతి రైతులకు మద్దతు తెలియజేసేందుకు వచ్చిన రాధాతో శ్రీరామ్, హరీష్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాధాతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న శ్రీరామ్ రైతులకు సంఘీభావం తెలియజేశారు. ఏడుకిలోమీటర్లు యాత్రలో పాల్గొన్నారు. వైసీపీ చెబుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ నిజమైతే ఈ మూడు సంవత్సరాల్లో ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications