బాబుకు మరో 'పని' లేదు, ఆయన చెప్పినట్లే: వెంకయ్య
హైదరాబాద్: హైదరాబాదులోని గ్రాండ్ కాకతీయ హోటల్లో శుక్రవారం నాటి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేకు శిక్షణ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్, రాజ్యాంగ నిపుణులు సుభాష్ కష్యప్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు.
చంద్రబాబుకు పని తప్ప మరో పని లేదన్నారు. కష్టపడి పని చేసి తనను తాను నిరూపించుకోవాలని ఆరాటపడుతుంటాడని కితాబిచ్చారు. ఏదో చేయాలనే తపన ఉన్న చంద్రబాబు లాంటి వారు జాగ్రత్తగా పనులు చేస్తారని, తప్పులు చేయరన్నారు. అలా అని మనిషి అన్నప్పుడు ఏదో తప్పులు చేస్తుంటారని, చంద్రబాబులాంటి వారి తక్కువగా చేస్తారన్నారు.
అందరు కూడా కష్టపడేతత్వం అలవర్చుకోవాలన్నారు. జనం కోసం జీవించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. శాసన సభ్యులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభలో సభ్యులు నిర్ణీత సమయం వరకు వేచి చూడాలన్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా.. రామరాజ్యం ఆదర్శమన్నారు.

ఈ మధ్యకాలంలో సభల తీరు చాలా బాధగా ఉందన్నారు. సభ ఎక్కువగా జరగక పోవడమే కాకుండా, అర్థవంతమైన చర్చలు జరగడం లేదన్నారు. మనం వ్యవహరించే తీరుతో గౌరవం వస్తుందని అద్వానీ చెప్పేవారన్నారు. మైకులు విరగ్గొడితే, పేపర్లు చించేస్తే గొప్ప విషయం కాదన్నారు. సభ్యులు వ్యక్తిగత కోరికలను పక్కన పెట్టాలని సూచించారు.
తన జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేదని, అలాగే అసభ్యంగా మాట్లాడలేదన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలన్నారు. మాతృభాషను, దేశాన్ని, మాతృభూమిని మరిచిపోతే మనిషే కాదన్నారు. సభను అడ్డుకుంటే ప్రభుత్వానికన్నా ప్రజలకే ఎక్కువ నష్టమన్నారు. ప్రజల దృష్టిలో చట్టసభల స్థాయి పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం విడిపోయిన అనంతరం ఏపీకి ఏమీ లేదని, ఈ నేపథ్యంలో అందరు కలిసి ముందుకు వెళ్లాలన్నారు. ఏపీ పేరు మాత్రమే పాతదని, అన్నీ సమస్యలే అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం మిగతా విషయాలు పక్కన పెట్టి వీలైనంతగా ఏకాభిప్రాయం వచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మీడియాలో కూడా మార్పు రావాలన్నారు. ఒకప్పుడు నిర్మాణాత్మకంగా మాట్లాడితే ప్రధానవార్తగా ఇచ్చేవారని, ఇప్పుడు వికారంగా మాట్లాడితే ఇస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications