నేనేం చెప్తున్నానో అర్థమౌతోందా?: వెంకయ్య ఆగ్రహం, ఫస్ట్ టైం.. బాబుపైనా?
విజయవాడ: కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడుకు తెలుగుదేశం పార్టీ పైన తొలిసారి కోపం వచ్చిందా? అంటే ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే అవుననే అనిపిస్తోందని అంటున్నారు. ఏపిలో టిడిపి - బిజెపి పొత్తు ఇంకా కొనసాగడం వెనుక వెంకయ్య నాయుడే కారణమనే వాదనలు ఉన్నాయి.
వెంకయ్య, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈ కారణంగానే పొత్తు ఇంకా కొనసాగుతోందనే వాదనలు ఉన్నాయి. అయితే, ఆదివారం నాడు వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే తొలిసారి ఆయనకు టిడిపి పైన కోపం వచ్చినట్లుగా ఉందని అంటున్నారు.
ఆయన వ్యాఖ్యల ద్వారా ఏపీలో టిడిపి, బిజెపి మధ్య విభేదాలు మరోసారి తేటతెల్లం అయ్యాయని అంటున్నారు. గత కొంతకాలంగా ఏపీలో టిడిపి, బిజెపి మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వెంకయ్య ఆదివారం విజయవాడలో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల అసోసియేషన్ సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ఫలితాలు సాధిస్తామన్నారు. కేంద్రం పైన విమర్శలు సరికాదన్నారు. కేంద్రంపై టిడిపి నేతలు వివిద సందర్భాల్లో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కితే ఉపయోగం ఏముంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏదైనా జరిగితే ఇంట్లో మాట్లాడుకోవాలని, అలా చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తానేం చెబుతున్నానో అర్థమవుతుందనుకుంటానని వ్యాఖ్యానించారు. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం విమర్శలు చేసుకుంటే పనులు పూర్తి కావన్నారు. ఇరు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు.