కెసిఆర్ను తప్పు పట్టలేం: విహెచ్, బాబు 420: గువ్వల
హైదరాబాద్: ఫిరాయింపుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును తప్పుపట్టలేమని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పంతా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరే కాంగ్రెస్ నేతలదేనని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిగా కెసిఆర్ 7 నెలల పాలనపై తప్పులు చేప్పలేమన్నారు. నిజాం రాజు లౌకికవాది అవునా, కాదా... నిజాం పాలనలో తప్పులు జరిగాయా లేదా అనే విషయాలు తెలియవని ఆయన అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంఘ్ పరివార్ నేతలపై ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి తెలియజేయాలన్నారు. దేశంలో ఉగ్రవాదుల దాడులతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని, దీనిపై ప్రధాని మోడీనే బాధ్యత వహించాలన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట టిఆర్ఎస్ శాసనసభ్యుడు గువ్వల బాలరాజు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు విజన్ 2020 అంటే ప్రజలు ఆయనను 420 అని అని అనుకున్నారని బాలరాజు వ్యాఖ్యానించారు.
తెలంగాణ టిడిపి నేతలు ఇంకా చంద్రబాబుకు వత్తాసు పలకడం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబు కుట్రలు ఆపాలని డిమాండ్ చేశారు. నిజాంను ముఖ్యమంత్రి ఎందుకు పొగిడారో వివరణ ఇవ్వాలన్న బిజెపి శాసనసభ్యుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. మంచి పనులు చేసినవారిని ప్రశంసించాలని అన్నారు. నిజాంను కెసిఆర్ ప్రశంసించడానికీ కంటోన్మెంట్, జిహెచ్ఎంసి ఎన్నికలకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications