విజయసాయి రెడ్డికి ఉప రాష్ట్రపతి ఆహ్వానం - డిన్నర్..!!
అమరావతి: ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ విందు సమావేశాలను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి దేశ రాజధానిలో ఆయన అధికార నివాసంలో ఈ డిన్నర్ మీట్ షెడ్యూల్ అయింది. రాజ్యసభలో అన్ని పార్టీల సభాపక్ష నాయకులను ఈ డిన్నర్కు ఆహ్వానించారు. ఈ మేరకు వారందరికీ ఆహ్వాన పత్రాలను పంపించారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా దీనికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
ఈ విందు సమావేశానికి రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని ఉప రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. కొత్తగా ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్గా బాధ్యతలను స్వీకరించినందున మర్యాదపూరకంగా సభాపక్ష నేతలందరినీ జగ్దీప్ ధన్కర్ విందుకు ఆహ్వానించారని పేర్కొన్నాయి. రెండు నెలల కిందట ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత సభాపక్ష నేతలకు విందు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. అలాగే- తెలంగాణ నుంచి టీఆర్ఎస్ సభాపక్ష నాయకుడు కే కేశవరావు ఈ భేటీలో పాల్గొననున్నారు. బీజేపీ సభా నాయకుడు, కేంద్రమంత్రి పియూష్ గోయెల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఇతర కొందరు సీనియర్ మంత్రులను జగ్దీప్ ధన్కర్ విందు సమావేశానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కమిటీల పునర్వ్యవస్థీకరణ విషయంపై మాట్లాడొచ్చని తెలుస్తోంది. హోమ్ శాఖ వ్యవహారాలపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కోల్పోనుంది. అలాగే- వాణిజ్య కమిటీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వైఎస్ఆర్సీపీ చేతికి- రవాణా, పర్యాటకం, పౌర విమానయానంపై ఏర్పాటైన కమిటీ ఛైర్మన్ పదవి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆయా అంశాలన్నీ కూడా ఈ విందు సమావేశంలో చర్చకు రానున్నాయి.












Click it and Unblock the Notifications