విడదల రజనీ విజయం పై ధీమా వెనుక..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో గెలుపు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్దిగా విడదల రజనీ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కొత్త అభ్యర్ది మాధవి బరిలోకి దిగారు. అయితే, అక్కడ గెలుపు గురించి సీఎం జగన్ ప్రత్యేకంగా రజనీకి దిశా నిర్దేశం చేసారు. రజనీ ఈ విషయంలో ముఖ్యమంత్రికి స్పష్టమైన హామీ ఇచ్చారు.
రసవత్తర పోరు
గుంటూరు పశ్చిమంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఇద్దరు మహిళా నేతలు పోటీ పడుతున్నారు. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావటంతో తమకు కలిసి వస్తుందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. అనూహ్యంగా జగన్ 2024లో బీసీ మహిళగా మంత్రి విడదల రజనీకి గుంటూరు పశ్చిమం సీటు కేటాయించారు. దాదాపు మూడు నెలలుగా రజనీ ప్రచార చేస్తున్నారు. టీడీపీలో అనేక తర్జన భర్జనత తరువాత గల్లా మాధవికి సీటు ఖరారు చేసారు. కొత్త అభ్యర్ది కావటం..అప్పటికే టీడీపీ, జనసేన నుంచి సీటు కోసం ఆశలు పెట్టుకున్న వారు రేసులో ఉండటంతో మాధవికి సహకారం అందటం లేదు. రజనీ తన ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ప్రతీ ఇంటికి చేరువయ్యారు.

రజనీ వ్యూహాత్మకంగా
వైసీపీ ఆవిర్భావం తరువాత గుంటూరు పశ్చిమంలో వైసీపీ సీటు గెలవలేదు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో రజనీకి అక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. తాను గెలిచి ఆ సీటును జగన్ కు బహుమతిగా ఇస్తానని రజనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కూటమిలో నెలకొన్న సమన్వయ లేమి.. వైసీపీ సంక్షేమం..రజనీ వ్యూహాత్మక ప్రచారం కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలోని తటస్థులతోనూ రజనీ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. పలు వర్గాలకు చెందిన మేధావులు, ప్రముఖుల ఇంటికి వెళ్లి వారితో మమేకం అవుతున్నారు. వారి మద్దతు కోరుతున్నారు. వారి సమస్యల పైన ఆరా తీస్తున్నారు. తాను గెలిచిన తరువాత నియోజకవర్గంలో తన విజన్ ఏంటో వారికి వివరిస్తున్నారు.
ఫలితం పై ఆసక్తి
సామాజిక సమీకరణాలు సైతం రజనీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమం అందుతోంది. నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి రజనీ కాల పరిమితితో హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో అన్ని వర్గాలతోనూ మమేకం అవుతున్నారు. ఇక..పశ్చిమంలో భారీ మెజార్టీ రావాలని..అది ఎంపీ అభ్యర్ది గెలుపుకు దోహదం చేయాలని పార్టీ నాయకత్వం రజనీకి టాస్క్ అప్పగించింది. అయితే, రజనీ పక్కా వ్యూహాత్మకంగా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రతీ ఓటు తన వైపు మళ్లించుకొనేలా అడుగులు వేస్తున్నారు. దీంతో, గుంటూరు పశ్చిమంలో చివరికి ఎవరిని విజయం వరిస్తుందనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications