చంద్రబాబు చేతికి సాయిరెడ్డి బ్రహ్మాస్త్రం - గుట్టు రట్టు..!!
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల పైన వరుసగా కేసులు నమోదు చేస్తోంది. కాకినాడ పోర్టు అక్రమాల కేసు విచారణలో సీఐడీ ఎదుట హాజరైన సాయిరెడ్డి అనేక అంశాలను ప్రస్తావించారు. జగన్ కోటరీ కారణంగానే తాను బయటకు వచ్చానని చెప్పారు. జగన్ చెప్పుడు మాటలు విని నష్ట పోతున్నారని వ్యాఖ్యానించారు. పోర్టు అక్రమాలు.. లిక్కర్ స్కాం పైన సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి.
కోటరీదే బాధ్యత
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసు కున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. అరబిందో సంస్థ నుంచి కేవీ రావుకు దాదాపు రూ.500 కోట్లు బదిలీ అయిన విషయంపై ప్రశ్నించారు. ఆ విషయం నాకు సంబంధం లేదని, అసలు నిధులు బదిలీ అయిన సంగతి కూడా తెలియదని వివరించిన ట్లు సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. విక్రాంత్ రెడ్డి గురించి అడిగితే సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసని చెప్పానన్నారు. కాగా, తనకు కేవీ రావు అంటే ఇష్టం ఉండదని.. సుబ్బారెడ్డి అమెరికా వెళ్లినప్పుడు కేవీ రావు ఇంట్లోనే ఉండేవారని సాయిరెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు.

సంబంధం లేదు
కాకినాడ పోర్టు వ్యవహారం లో జగన్ కు సంబంధం లేదని సాయిరెడ్డి చెప్పారు. తనను ఉద్దేశ పూర్వకంగా ఒక అధికారి ఈ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చారు. అరబిందో నుంచి వాటాల బదిలీ పై ప్రశ్నించారని తెలిపారు. తన కుమార్తెను వారి ఇంటికి పంపించానే తప్ప, తనకు అరబిందో వాళ్లకు ఆర్థిక సంబంధాలు లేవని స్పష్టం చేసారు. ఇక, వైసీపీలో తాను జగన్ కోటరీ కారణంగానే బటయకు వచ్చినట్లు వెల్లడించారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగి పోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్ కు చెప్పానన్నారు. జగన్ కు ఎవరినైనా పరిచయం చేయాలనుకుంటే, ముందుగా కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి అరోపించారు.
కూటమికి అస్త్రం
తాను ప్రలోభాలకు లొంగిపోయానని, విశ్వసనీయత కోల్పోయానని జగన్ అన్నారని గుర్తు చేసారు. అయితే తాను ప్రలోభాలకు లొంగిపోలేదని, జగన్ లోనే మార్పు వచ్చిందన్నారు. తనకు జగన్ కు మధ్య విభేదాలకు కారణం కోటరీలోని వారేనని చెప్పుకొచ్చారు. కోటరీకి దూరంగా ఉంటేనే జగన్ కు భవిష్యత్ ఉంటుందని చెప్పారు. లిక్కర్ కేసు గురించి సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ కేసులో కర్మ, కర్త, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేని చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చిన సమయంలో మరిన్ని విషయాలు తనకు తెలిసినవి చెబుతానని పేర్కొన్నారు. తాజాగా లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ తమ సోషల్ మీడియాలో ఖాతాలో ఆరోపణలు చేసింది. దీని పైన మిథున్ రెడ్డి సైతం స్పందించారు. ఇప్పుడు సీ పోర్టు, లిక్కర్ స్కాం పైన సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి అస్త్రంగా మారటం ఖాయమనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications