బాబు ఎప్పుడూ తిరస్కృతుడే ; మాలోకానికి వినిపిస్తుందా ; జాలి పడాల్సిందే అన్న సాయిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చంద్రబాబును విమర్శించని రోజంటూ లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే విజయసాయిరెడ్డి తాజాగా రాజకీయాల కోసం ఆడపిల్లల గౌరవాన్ని మంట కలుపుతున్నారు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు .అంతేకాదు చంద్రబాబు అనుకూల మీడియాపై ఆయన నిప్పులు చెరిగారు.

రాజకీయాల కోసం ఆడపిల్లల గౌరవాన్ని మంటగలుపుతున్నారన్న సీఎం జగన్ విచారం
ప్రభుత్వంపై బురద చల్లాలని ఆరాటపడే వ్యవస్థను మనం చూస్తున్నాం అని పేర్కొన్న విజయసాయిరెడ్డి కొంత మంది ప్రతిపక్ష నాయకులు, ఎల్లో మీడియా తమస్వప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం ఆడపిల్లల గౌరవాన్ని మంటగలుపుతున్నారని సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా బాబు కోసం అను'కుల' మీడియా పచ్చి అబద్ధాలు వండి వడ్డిస్తుంటే, 'ఆర్తనాదాలు' ఏ రేంజిలో ఉన్నాయో ఊహించవచ్చు అంటూ చంద్రబాబు అనుకూల మీడియా పై విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు.

బరితెగించి తుపాకి రాముడి పాత్రలు పోషిస్తుంటే, హత విధీ!
ఎక్కడైనా అవినీతి జరిగినట్టు ఆధారాలుంటే రాయొచ్చు. తప్పు జరిగితే ఎత్తి చూపించొచ్చు. బరితెగించి తుపాకి రాముడి పాత్రలు పోషిస్తుంటే, హత విధీ! అని జాలి పడాల్సిందే అంటూ ఎలాంటి అవినీతి జరగకున్నా, ఆధారాలు లేకున్నా బరితెగించి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో మీ టీవీలు, పత్రికల్లో ఎన్ని 'పొగ బాంబులు' విసిరినా కలవరపడే వారు లేరు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ని అభూతకల్పనలు సృష్టించినా నమ్మే వారు లేరని విమర్శించారు. అఖండ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని విజయ సాయి రెడ్డి తేల్చి చెప్పారు.

బాబు ఎప్పటికీ తిరస్కృతుడిగానే మిగిలిపోతాడు
జగన్ సర్కార్ ను ఏం చెయ్యలేరని వ్యాఖ్యానించారు. క్రెడిబులిటీని ఫణంగా పెట్టి ఎంత 'హింసించుకున్నా' దిగ్భ్రాంతికర ఘటన ఏదీ జరగదు అంటూ విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. 2024 తర్వాత కూడా బాబు తిరస్కృతుడిగానే మిగిలిపోతాడు అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. 2024 తర్వాత కూడా టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సాయి రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని రానున్న రెండేళ్లలో 36,384 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని 75 వేల మందికి పైగా ఉపాధి కల్పించే దిశగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి జగన్ శ్రీకారం
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారంటూ వెల్లడించారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా మౌలిక సదుపాయాల కల్పన చేసినట్లుగా విజయ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక భారత్ లో కరోనా మహమ్మారి ఎప్పటికి ఉండిపోయే వ్యాధిగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఒక శాస్త్రీయ అధ్యయనం ఫలితాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని తెలిపిందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి తో సహజీవనం తప్పదని ఏడాది క్రితమే సీఎం జగన్ అంటే వెకిలి వ్యాఖ్యలు చేసిన బాబు అండ్ కో ఇప్పుడేమంటారో చెప్పాలి అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు .

రమ్య హత్య ఘటనపై జాతీయ ఎస్సీ కమీషన్ ఏమందో వినిపిస్తుందా మాలోకం
ఇక రమ్య హత్యా కేసు ఘటనపై జాతీయ ఎస్సీ కమీషన్ విచారణపై నారా లోకేష్ కు పంచ్ ఇచ్చారు. జాతీయ ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. దళితులపై ఎక్కడ నేరాలు జరిగినా ఫిర్యాదు చేసి న్యాయం పొందొచ్చు. అలాంటి అత్యున్నత కమిషన్ సభ్యులు రాష్ట్రాన్ని సందర్శించి హత్యకు గురైన రమ్య కేసులో ప్రభుత్వం వేగంగా, మానవతా దృక్పథంతో స్పందించిన తీరును ప్రశంసించారని సాయి రెడ్డి పేర్కొన్నారు . మాలోకానికి వినిపిస్తోందా? అంటూ లోకేష్ ను ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications