బయటికొస్తా, విలీనం చేస్తారా: కెసిఆర్‌కు విజయశాంతి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా అని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి సవాల్ విసిరారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామంటే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇటీవల కెసిఆర్ మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని.. ఇప్పుడు తమ పార్టీని విలీనం చేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించినట్లు ఆమె తెలిపారు.

ఈ నేపథ్యంలోనే తాను పై వ్యాఖ్యలు చేసినట్లు విజయశాంతి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని ఎవరైనా అడిగారా అని ఆమె ప్రశ్నించారు. ఎవరూ అడగకపోయినా కెసిఆర్ విలీనం చేయమని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. సీమాంధ్రలోని 25 పార్లమెంటు స్థానాలను వదులుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని విజయశాంతి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మాట నిలబెట్టుకున్నారని, ఆమెనే తెలంగాణకు నిజమైన తల్లి అని చెప్పారు.

Vijayashanthi challenges KCR on merger issue

ఒక ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్ఎస్‌ను జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ విలీనం చేయాలని ఏనాడూ కోరలేదని చెప్పారు. తాను పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చేరానని విజయశాంతి తెలిపారు. తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయం వెలువడిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి కృతజ్ఞతలు చెప్పానని, అందుకే టిఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిందని ఆరోపించారు. అయితే తాను అప్పటికీ ఏ పార్టీలో చేరలేదని, తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరానని విజయశాంతి చెప్పారు.

ఎన్నికల తర్వాత దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కెసిఆర్, తాను అడిగితే అప్పటి వరకు చూద్దాంలే అని కసురుకున్నట్లు విజయశాంతి తెలిపారు. బడుగుబలహీన వర్గానికి చెందిన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. నాయకుడంటే మాటకు కట్టుబడి ఉండాలని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే రెండు ప్రాంతాల్లోనూ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణానికి మీరే కావాలా? అని టిఆర్ఎస్‌ను ప్రశ్నించన ఆమె.. తెలంగాణ జెఏసితోపాటు మరెందరో నాయకులు ఉన్నారని చెప్పారు.

ఇప్పుడు తామనుకున్న తెలంగాణ రాలేదని అంటున్న కెసిఆర్, అప్పుడే ఎందుకు ప్రకటించలేదని విజయశాంతి ప్రశ్నించారు. కెసిఆర్ డిమాండ్లు తెలంగాణ కోసమా? లేక మరేమైనా ఉన్నాయా అని ఆమె అన్నారు. కెసిఆర్ మాట నిలబెట్టుకోని మనిషని ఆమె అన్నారు. దయచేసి పద్దతి మార్చుకోండి.. కుంటిసాకులతో అబద్ధాలు చెప్పకండని కెసిఆర్‌ను కోరింది. స్వాత్యంత్రం ఇచ్చినందుకు దేశ ప్రజలు బ్రిటిషువారికి కృతజ్ఞతలు చెప్పలేదని.. గాంధీ, నెహ్రూలనే ఆరాధించారని కెసిఆర్ అన్న మాటలపై ఆమె స్పందించారు. తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడి ప్రజలు సోనియానే దేవతగా చూస్తారని చెప్పారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లిని వెన్నుపోటు పోడవటం బాధారమని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తమ విశ్వాసం చాటుకుంటున్నారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన సమయంలోనూ టిఆర్ఎస్ నాయకులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. ఇదే తరహాలో కాంగ్రెస్‌ను కూడా గెలిపిస్తారని అన్నారు. తెలంగాణ కట్టుబడి ఉన్నామన్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై అనేక మెలికలు పెట్టిందని విజయశాంతి తెలిపారు.

చెల్లెలు అంటారు.. మైకు ఇవ్వరు

వచ్చే ఎన్నికల్లో కెసిఆర్‌పై పోటీ చేస్తారా అని అడగ్గా.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే తాను సిద్ధమేనని చెప్పారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా తెలంగాణ ప్రజల కోసం నిర్వహిస్తానని విజయశాంతి తెలిపారు. తన పార్టీని టిఆర్ఎస్‌లో విలీనం చేసినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు. చెల్లెలు అని పిలిచే కెసిఆర్, తనకు మాట్లాడేందుకు మైకు ఇవ్వలేదని ఆరోపించారు. తాను మాట్లాడాలంటే కెసిఆర్ అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని విజయశాంతి చెప్పారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కూడా ప్రయత్నించారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+