త్వరలో విజయవాడ-హైదరాబాద్ ఎక్స్ప్రెస్వే- భూసేకరణకు కేంద్రం ప్రయత్నాలు
ఏపీ విభజన తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారిన విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్వేగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఈ మేరకు భూసేకరణ చేపట్టాలని కూడా కోరింది. అయితే స్ధానికంగా ఉన్న సమస్యలతో ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది.
విజయవాడ-హైదరాబాద్ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టును త్వరలో పట్టాలెక్కించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తాజాగా మరోసారి ప్రకటించారు. దీంతో పాటే హైదరాబాద్-బెంగళూరు రోడ్డును కూడా ఎక్స్ప్రెస్వేగా మార్చనున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. దీంతో ఏపీ, తెలంగాణ, కర్నాటకకు రోడ్డు ప్రయాణం మరింత మెరుగవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన రోడ్డు ప్రాజెక్టులు పూర్తి కాలేదని, వాటిని పూర్తి చేస్తే తదుపరి ప్రాజెక్టులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో రహదారుల అభివృద్ధిపై తాజాగా ఢిల్లీలో మాట్లాడిన కిషన్రెడ్డి... హైదరాబాద్-విజయవాడ ఎక్స్ప్రెస్వే అభివృద్ధికి భూసేకరణ సమస్యగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణలో చురుగ్గా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాన్ని కిషన్రెడ్డి వ్యక్తం చేశారు. త్వరలో ఈ విషయంపై సీఎం కేసీఆర్కు లేఖ రాస్తామన్నారు. హైదరాబాద్ వైపు నుంచి పనులు మొదలైతే ఆ తర్వాత ఏపీలో విజయవాడ మార్గంలో పనులకు మార్గం సులువవుతుందన్నారు. ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications