బ్లేడ్ దాడులతో బెంబేలెత్తించారు.. 'ఒంటరి'గా కనిపిస్తే అంతే!..
ఏప్రిల్ 9న వినాయకుడి గుడి నుంచి మంగళగిరి వైపు నడిచి వెళ్తున్న ఓ యువకుడిని బెదిరించి నగదు లాక్కునేందుకు ప్రయత్నించారు.
విజయవాడ: ఈజీ మనీకి అలవాటుపడ్డ ఇద్దరు పండ్ల వ్యాపారులు బ్లేడ్ బ్యాచ్ అవతారమెత్తారు. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేవారిని టార్గెట్ చేసి.. బ్లేడుతో దాడి చేయడం, ఆపై డబ్బులతో ఉడాయించడం వీరి పని. తాజాగా
సీసీఎస్ పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
పాత రాజరాజేశ్వరీపేటకు చెందిన మొఘల్ నయ్యూమ్ (25), వై.ఎస్.ఆర్.కాలనీకి చెందిన పిల్లా భాస్కర్ (24)లుగా వీరిని గుర్తించారు. కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో ఈ ఇద్దరు పండ్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే అందులో వచ్చిన డబ్బులు ఎటూ సరిపోకపోవడంతో.. ఈజీ మనీకి ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే ఒంటరిగా వెళ్తున్నవారిపై బ్లేడుతో దాడి చేసి డబ్బులు లాక్కుని పారిపోవడం.. ఆ డబ్బుతో జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఏప్రిల్ 9న వినాయకుడి గుడి నుంచి మంగళగిరి వైపు నడిచి వెళ్తున్న ఓ యువకుడిని బెదిరించి నగదు లాక్కునేందుకు ప్రయత్నించారు.

అయితే అతను గట్టిగా ప్రతిఘటించడంతో బ్లేడుతో వీపుపై దాడి చేశారు. ఇదే క్రమంలో ఏప్రిల్ 26 అర్థరాత్రి పూట కాళేశ్వరరావు మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరు పోలీసుల కంటపడ్డారు. విషయమేంటా! అని ఆరా తీస్తే.. బ్లేడ్ బ్యాచ్ వీరేనని తేలింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, గతంలోను బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ ముఠా చాలానే అరాచకాలు చేసింది. ఒకానొక సమయంలో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు. అప్పట్లో 14మంది ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు బ్లేడ్ బ్యాచ్ బెజవాడలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications