ఏపీలో సచివాలయ ఉద్యోగుల షాక్- రేపటి నుంచే-పింఛన్ల పంపిణీపై..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన రాకపోవడంతో నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి మరోసారి ఇవాళ రిమైండర్ నోటీసు ఇచ్చారు. అదే సమయంలో నిరసనల షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలో సచివాలయాల్లో సేవలకు అంతరాయం తప్పేలా లేదు.
హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 23నుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సంచాలకులకు ముందస్తు నోటీసు అందించినట్లు ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి.జాని పాషా,సెక్రటరీ జనరల్ విప్పర్తి.నిఖిల్ కృష్ణ,రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ రజాక్ ప్రకటించారు. ప్రతినిధుల బృందం సెప్టెంబర్ 8వ తేదీన రాష్ట్ర కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ ముందస్తు సమాచారం ఇస్తూ 15 రోజుల గడువుతో నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.

ఇవాళ్టితో 15 రోజుల గడువు ముగిసినప్పటికీ సచివాలయాల శాఖ నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి స్పందన లేనందున ఇవాళ ముందస్తు నోటీసులో పొందుపరిచిన సమాచారం ప్రకారం రేపటి నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమాల కార్యాచరణ సమాచారం రాష్ట్ర సంచాలకులకు అందించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ఐక్యవేదిక తరపున విజయవాడ వేదికగా మరోసారి భేటీ అయి ఉద్యోగుల నియమ నిబంధనలకు కట్టుబడి ఆందోళనల్ని ఉధృతం చేస్తామన్నారు.

మరోవైపు రాష్ట్రంలో రేపటి నుంచి చేపట్టే నిరసన కార్యక్రమాల వివరాలు కూడా ప్రకటించారు.
1.సెప్టెంబర్ 23వ తేదీ నుండి ప్రతీ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు, మధ్యాహ్న భోజన విరామంలో కార్యాలయాల ముందు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన
2.సెప్టెంబర్ 26 శుక్రవారం మధ్యాహ్న భోజన విరామంలో మండల , మునిసిపల్ కార్యాలయాల ముందు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు.
3.సెప్టెంబర్ 27న గ్రామ , వార్డు సచివాలయం పరిధిలో జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ , రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందిస్తూ నిరసన
4.సెప్టెంబర్ 28న విశాఖపట్నం వేదికగా ప్రాంతీయ సభ, అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ శంఖారావం పేరిట 26 జిల్లాల్లో స్టీరింగ్ కమిటీల సమావేశాలు.
5.సెప్టెంబర్ 29న సామాజిక పింఛన్ పంపిణీ నగదు బ్యాంకుల నుండి డ్రా చేసిన అనంతరం అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలగాలని నిర్ణయం
6. అక్టోబర్ 1వ తేదీన నల్ల బ్యాడ్జీలతో పింఛన్ పంపిణీ
7.అక్టోబర్-2 గాంధీ జయంతి రోజు ప్రత్యక్ష కార్యక్రమాలు లేకుండా మహాత్మా మా ఘోష విను అంటూ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్
8.అక్టోబర్ -3 న మండల , మునిసిపల్ స్టీరింగ్ కమిటీల సన్నాహక సమావేశం.
9.అక్టోబర్ -4 న జిల్లా స్టీరింగ్ కమిటీల సన్నాహక సమావేశం.
10.అక్టోబర్-5 రాజమహేంద్రవరం వేదికగా ప్రాంతీయ సభ.












Click it and Unblock the Notifications