ముస్తాబు అవుతున్న టీటీడీ అనుబంధ ఆలయాలు
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 72,067 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,212 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 14 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ నెల 27వ తేదీన వినాయక చవితి. ఈ పండగకు తిరుమల ముస్తాబు అవుతోంది. తిరుమలతో పాటు తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో గణేష చతుర్థి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు.
తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలుపుతారు. శ్రీ వినాయక స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపడతారు.
సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వినాయక స్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు మూలవర్లకు అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజాదికాలు ఉంటాయి.
గోవిందరాజస్వామివారి ఆలయంలో..
సెప్టెంబరు 3 నుండి 5 వ తేదీ వరకు నిర్వహించబోయే పవిత్రోత్సవాలకు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ముస్తాబు అవుతోంది. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఉంటుంది. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య రుత్విక్వరణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్రసమర్పణ చేస్తారు.
సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వహించి, ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 3న ఉదయం పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సె
ప్టెంబరు 4న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. 5న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications