రేపు తిరుమలకు వెళ్లే వారికి టీటీడీ ముందస్తు సూచనలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తోంది. ఇక రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 14న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం చేయనున్నారు అర్చకులు. 15న ధ్వజారోహణంతో ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు ఆరంభమౌతాయి. ఈ నేపథ్యంలో అధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తోన్నారు. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడం, వాహన సేవలను తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోన్నారు.
మరోవంక తిరుమలలో అనూహ్య రద్దీ నెలకొంది. ప్రస్తుతం క్యూలైన్లలోని భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. లాంగ్ వీకెండ్ రావడం వల్ల తిరుమలకు చేరుకుంటోన్న భక్తుల సంఖ్య సైతం భారీగా ఉంటోంది. నేటి నుండి మంగళవారం వరకు వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

శుక్రవారం నాడు 72, 408 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28, 691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా రూ. 4.39 కోట్ల ఆదాయం టీటీడీకి అందింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో మొత్తం 31 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయింది. టోకెన్ లేని సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
ఈ రద్దీని క్రమబద్దీకరించడానికి టీటీడీ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 13వ తేది ఆదివారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. దీంతో నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫారసు లేఖలను కూడా టీటీడీ స్వీకరించట్లేదు. రద్దయిన వీఐపీ బ్రేక్ దర్శన సమయం మొత్తాన్నీ సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడానికి వినియోగించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
కాగా.. తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, జానకి దేవి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు.. ఆయనను కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి చంద్రబాబుకు వివరించారు.













Click it and Unblock the Notifications
