బ్రేక్ దర్శనాలకు.. బ్రేక్
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఈ- డిప్ ద్వారా ఎంపిక చేశారు.
182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించింది టీటీడీ. మొదటి మూడు రోజులు కూడా ప్రత్యేక ప్రవేశం, శ్రీవాణి దర్శనాలు రద్దయ్యాయి. మిగిలిన ఏడు రోజుల కోసం ఈ ఉదయం 10 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి. రోజుకు శ్రీవాణి- 1,000, ప్రత్యేక ప్రవేశం- 15,000 టికెట్లు జారీ చేశారు టీటీడీ అధికారులు.

వైకుంఠ ఏకాదశి సహా తిరుమలలో జరిగే వివిధ సందర్భాలు, విశేష పర్వదినాల నేపథ్యంలో 15 రోజుల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేకులు పడ్డాయి. వీటికి సంబంధించిన వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. 2026 జనవరి వరకు ఇది కొనసాగుతుంది. శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు పర్వదినాల వల్ల వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేశారు. ఈ నెల 23వ తేదీన మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది.
ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. వైకుంఠ ఏకాదశి ముందు రోజైన 29 కలుపుకొని, 30వ తేదీ నుండి జనవరి 8వ తేది వరకు అంటే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ముగిసేంత వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉండవు. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరిస్తారు. అదే నెల 25వ తేదీన రథ సప్తమి. ఈ పండుగ కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు అయ్యాయి. ఆయా తేదీలకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫారసు లేఖలను కూడా టీటీడీ స్వీకరించదు.












Click it and Unblock the Notifications