ఏపీ పంట పండింది... మరో వరం ప్రకటించిన నరేంద్రమోడీ
కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలే ఉండటంతో అభివృద్ధి సజావుగా జరుగుతుందని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించి ఏపీని ఎంపిక చేయడంతోపాటు వివిధ పనులకు సంబంధించిన నిధులను కూడా శరవేగంగా విడుదల చేస్తోంది. అలాగే రైల్వేలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇందులో భాగంగా అమరావతి రైల్వే లైను పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు రైల్వే ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న వందేభారత్ స్లీపర్ రైలును ఏపీకి కేటాయించబోతున్నారు.
విశాఖకు స్లీపర్ రావాలంటే 6 నెలల సమయం
విశాఖపట్నం నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు నడిపించాలంటూ ప్రభుత్వం నుంచి కేంద్రానికి వినతులు వెళ్లాయి. అలాగే ఎంపీలంతా లోక్ సభలో ప్రస్తావించడంతోపాటు లేఖలు రాయడం, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలవడం జరిగాయి. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో వీటి ఉత్పత్తి జరుగుతోంది. తొలి వందేభారత్ స్లీపర్ జనవరిలో పట్టాలెక్కబోతోంది. దీన్ని ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ మధ్య తిప్పుతారనే విషయంలో స్పష్టత లేదు. తాజాగా విశాఖ నుంచి తిరుపతికి ఏపీ అడుగుతుండటంతో ఆరు నెలల్లో దీన్ని కేటాయించబోతున్నారు.

విజయవాడ నుంచి బెంగళూరుకు కూడా
ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ పనులు జరుగుతుండటంతో వరుస ప్రకారం విశాఖకు రావాలంటే ఉత్పత్తి జరగడానికి ఆరునెలల సమయం పడుతోంది. అంటే జూన్ లో ఈ రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు రెండు, భువనేశ్వర్ కు ఒకటి, దుర్గ్ కు ఒకటి నడుస్తున్నాయి. స్లీపర్ వస్తే ఐదు రైళ్లవుతాయి. అలాగే విజయవాడ నుంచి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, నంద్యాల, కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరుకు వందేభారత్ నడపాలనే ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించారు. త్వరలోనే ఇది కూడా కార్యరూపం దాల్చబోతోందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications