కొడ్తారా!: జగన్ పార్టీపై బాబు, మోడీ ఫోన్, రాళ్ల దాడులు
చిత్తూరు/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమి భయంతో దాడులకు పాల్పడుతోందని, అందరు నిర్భయంగా ఓటేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. టిడిపి పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తల పైన జగన్ పార్టీ వర్గీయులు చేస్తున్న దాడులను ఆయన ఖండించారు. పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
బాబుకు మోడీ ఫోన్
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఓటింగ్ సరళిపై చంద్రబాబు నుండి ఆరా తీశారు. పోలింగ్ తీరు, ఓటర్ల నాడి లాంటి అంశాలపై వివరాలు కనుక్కున్నారు.
గుంటూరులో ఉద్రిక్తం
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కంభంపాడులో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా పెద్ద అగ్రహారంలో జగన్ పార్టీ, టిడిపిలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి.
గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. ప్రకాశం జిల్లాలోను ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. విశాఖపట్నం టిడిపి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ ద్విచక్ర వాహనం పైన వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.