కాపు రిజర్వేషన్ల పై సీఎం జగన్ నెక్స్ట్ స్టెప్..!!
అగ్రవర్ణాల్లో ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు శాతం రిజర్వేషన్లు కల్పించటాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. దీంతో.. ఏపీలో ఇప్పుడు మరో కాపు రిజర్వేషన్ల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఏపీలో కాపులకు బీసీల్లో చేర్చాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేర్చే అంశం పైన హామీ ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో దీని పైన అధ్యయనం కోసం మంజునాధ కమిషన్ ఏర్పాటు చేసారు. ఆ తరువాత 2019లో కాపులకు 5 శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది.

కాపులకు 5 శాతం రిజర్వేషన్ల పై
ఈ మేరకు చేసిన రెండు చట్టాల పైన కోర్టులో కేసు దాఖలైంది. కోర్టులో కేసు కారణంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్ణయం అమలు పెండింగ్ లో పెట్టింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ 2021 జూలై 14న ఉత్తర్వులిచ్చింది. అయితే, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కాపులకు 5 శాతం, మిగిలిన వారికి 5 శాతం ఇస్తూ చట్టాలు చేయటం రాజ్యంగా విరుద్దమని గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. కోర్టులో కేసుల కారణంగా ఏపీ ప్రభుత్వం కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ల అమలును పెండింగ్ లో ఉంచింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కులాలవారీ ఇచ్చే అవకాశం ఉందా అనే అంశం పైన చాలా మంది అప్పట్లో కోర్టులకు వెళ్లారు.

నాడు స్పష్టత ఇచ్చిన సీఎం జగన్
ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. మంజునాధన్ కమిటీ వేసిన ప్రభుత్వం..ఆ కమిటీ నివేదికలో మాత్రం కమిటీకి ఛైర్మన్ గా ఉన్న మంజునాధన్ సంతకం లేకుండానే రిపోర్టు తీసుకుందని గుర్తు చేసారు. కాపులు తమను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంటే, కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు సబ్ కేటగిరైజేషన్ చేస్తూ 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పటంతో, ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లిందని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా కాపులు కోరుకున్నట్లుగా బీసీల్లో ఉన్నారా.. ఓసీల్లో ఉన్నారా అనేది అర్దం కాని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించారు. బీసీల్లో చేర్చాలంటే గతంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించి పెంచటానికి వీళ్లేదని గుర్తు చేసారు.

తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో..మరోసారి
వీటిని పరిశీలించిన తరువాత తాము.. ఈ విషయం పరిశీలన చేస్తామని మాత్రమే చెబుతూ.. మేనిఫెస్టోలో కాపుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. ఇక, ఇప్పుడు సుప్రీం కోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్దించటం..కాపు వర్గాన్ని ఓన్ చేసుకొనేందుకు జనసేన తో పొత్తు ద్వారా టీడీపీ ప్రయత్నిస్తున్న సమయంలో..సీఎం జగన్ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారుతోంది. సుప్రీం తీర్పు పూర్తి ఉత్తర్వులు పరిశీలించి.. కాపులకు చంద్రబాబు కంటే మంచి చేసే నిర్ణయం జరుగుతుందని వైసీపీలోని ముఖ్య నేత వెల్లడించారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ ఆర్ క్రిష్ణయ్య సుప్రీం నిర్ణయం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications