అందుకే ఆ నిర్ణయం...అంతే తప్ప భయపడి కాదు:చినరాజప్ప;అవినీతిని ప్రోత్సహించేందుకే:జీవీఎల్
అమరావతి:సిబిఐ విచారణకు ఎపి ప్రభుత్వం నో చెబుతూ తీసుకున్న నిర్ణయంపై సంచలనం రేగడంపై హోం మంత్రి చినరాజప్ప రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపించారు.
వివాదాల వల్ల సిబిఐ ప్రతిష్ట మసకబారినందువల్లే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప కేంద్రానికి భయపడి కాదని చినరాజప్ప చెప్పారు. ఈ నిర్ణయం ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాదని...నిపుణులు, మేథావుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చినరాజప్ప తెలిపారు.
విజయవాడలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వాస్తవానికి సీబీఐ ఒక మంచి వ్యవస్థ అని, అందుకే జనరల్ కన్సెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే 1946 లోనే చట్టంలో సెక్షన్ 6 ప్రకారం జనరల్ కన్సెంట్ ఇవ్వడం జరిగిందని...అప్పుడు కొన్ని రాష్ట్రాలు ఇవ్వలేదని చినరాజప్ప వివరించారు.
అయితే కేంద్ర ప్రభుత్వం తీరుతో సీబీఐ ప్రతిష్ట మసకబారిందని...ఇలాంటి తరుణంలో సిబిఐ గురించి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని భావించి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను మార్చి ఇప్పుడు 176 జీవోను తీసుకువచ్చామని చినరాజప్ప తెలిపారు. సీబీఐని కేంద్రం రాజకీయ పావుగా వాడుకుంటోందని, దీంతో దానిపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోయిందని చినరాజప్ప వివరించారు.
మరోవైపు సిబిఐ విచారణలకు అనుమతి నిరాకరిస్తూ ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు విమర్శల వర్షం కురిపించారు.శుక్రవారం ఢిల్లీలో జివిఎల్ మీడియాతో మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం మూడు నెలల కిందట సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఇప్పుడు ఉపసంహరించుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎపి ప్రభుత్వం కేవలం అక్రమార్జన చేసేవారికి కొమ్ముకాసేందుకు, అవినీతిని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగితే తన మీద దాడులు జరిగినట్లు సిఎం చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. వారం రోజులుగా చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బెంబేలెత్తుతున్నారో గమనిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఒక అవినీతి కూటమి కోసం రెండు సార్లు ఢిల్లీ వచ్చి వెళ్లారని జివిఎల్ ధ్వజమెత్తారు.
"అవినీతి చేయడం ఎలా?...ఆ అవినీతి బైటపడకుండా ఉండటం ఎలా?"...అనే విజన్ డ్యాకుమెంట్ను చంద్రబాబు రాసుకోవాలని ఎంపి జివిఎల్ ఎద్దేవా చేశారు. సీబీఐలోని కలహాలను ఆసరాగా చేసుకొని చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.అయితే మీ అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని జివిఎల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శక పాలన అందించాలని, అవినీతి అంతం చేయాలని చూస్తుంటే ఎపి సిఎం చంద్రబాబు దాన్ని నీరుగార్చడానికి యత్నిస్తున్నారని బిజెపి ఎంపి జీవీఎల్ ఆరోపించారు.