ఏపీ, టీల మధ్య 'నాగార్జున' జగడం: రాద్దాంతమంటూ హెచ్చరికలు
హైదరాబాద్: నాగార్జున సాగర్ 13 గేట్ల నిర్వహణ బాద్యతలను తమకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడంతో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరో జగడం ప్రారంభమైంది. దీనిపై ఇరు రాష్ట్రాల మంత్రులు, ఇతరు నేతలు కూడా పోటాపోటీగా స్పందిస్తున్నారు.
సాగర్ 13 గేట్ల నిర్వహణ బాధ్యత తమకే ఇవ్వాలని ఏపీ లేఖ రాయడం సరికాదని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పగా, నెల రోజుల నుండి కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు.
సాగర్ నీటి వివాదంలో కృష్ణా బోర్డు తక్షణమే జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడయాతో మాట్లాడారు. సామరస్య పూర్వక పరిష్కారానికి రెండు రాష్ట్రాలు చొరవచూపాలని, టీటీడీపీ నేతలు దీనిపై స్పందించాలన్నారు.

సాగర్ నీటి విడుదలపై టీఆర్ఎస్కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. సాగర్ వివాదంపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని గుత్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగర్ నీటి వివాదంలో కృష్ణా బోర్డు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. సాగర్ నీటి విడుదలపై తెరాసకు ఏమాత్రం అవగాహన లేదన్నారు.
విభజన బిల్లు ప్రకారం నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణ ప్రభుత్వానికి, శ్రీశైలం నిర్వహణ ఏపీకి కేటాయించారని, శుక్రవారం కూడా సాగర్ కుడికాల్వ నుండి మూడవేల క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా ఐదువేల క్యూసెక్కులు ఏపీకే వదిలారని, మన నీళ్లను సైతం దోచుకోవాలనే దురాశ వారిదని, ఇది అన్యాయమని కేసీఆర్ గురువారం అన్నారు.
ఏపీ సర్కారు లేఖ రాయడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఐదు రోజులకే తెలంగాణ వ్యతిరేక చర్యలు ప్రారంభించారన్నారు. ఏపీ ఇలాగే వ్యవహరిస్తే జూరాల నుండి ఒక్క చుక్క నీటిని కూడా వదిలేది ఉండదని హెచ్చరించారు.
హరీష్ రావు వ్యాఖ్యల పైన దేవినేని కూడా ధీటుగానే స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపి వేసిందన్నారు. సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం కబ్జా చేసిందని హరీష్ రావు అనడం సరికాదన్నారు. కృష్ణా డెల్టా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలకు సహకరించాలన్నారు.
సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలిపారు. పంటలను, రైతులను కాపాడుకోవాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు. మూడు ప్రాంతాల రైతులు తమకు సమానమేనని దేవినేని చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారుల కలిసి మెలిసి పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications