ఈసీపై కాదు .. వివక్ష, పక్షపాతంపైనే పోరాటం, చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి : ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై మరోసారి స్పందించారు ఏపీ సీఎం చంద్రాబుబు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదని స్పష్టంచేశారు. అధికారులు చూపిస్తోన్న వివక్ష, పక్షపాత ధోరణిపై ఫైట్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల మోదీ ఓటమి భయంతోనే ఈసీపై, ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారని కామెంట్ చేయగా చంద్రబాబు స్పందించారు.
వారికి మినహాయింపా ?
మోదీ, అమిత్ షాపై ఎన్నికల కోడ్ అమలు చేయకపోవడంపై పోరాడుతున్నట్టు మరోసారి స్పష్టంచేశారు. మెజారిటీ ప్రజలను ప్రభావితం చేసేలా వార్దాలో మోదీ మాట్లాడారని, బాలాకోట్ దాడుల గురించి కూడా ప్రస్తావించారని ఇవి ఎన్నికల ఉల్లంఘన కిందకు వస్తోందని పేర్కొన్నారు. వ్యక్తిగత అంశాలపై ఈసీని తామెప్పుడు తప్పుపట్టలేదని ... ఎన్నికల ప్రక్రియను మాత్రమే పక్షపాతం లేకుండా నిర్వహించాలని సూచించామని తెలిపారు.
అదరం .. బెదరం ...
విపక్షాలను బెదిరించేందుకు మోదీ ఈడీ, ఐటీని వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యవహారం మొత్తంపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని మండిపడ్డారు. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలకు మద్దతుగా ఈసీ వ్యవహరిచడంపైనే తమ పోరాటమని తెలిపారు.
విధానాల ప్రాతిపదికనే ...
విధానాల ప్రాతిపదికనే ఈసీపై తాము పోరాడుతున్నట్టు స్పష్టంచేశారు. వీవీ ప్యాట్లు లెక్కించాలని ప్రతిపక్షాలు కోరితే మోదీకి ఏం సంబంధం అని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై ఆయనకెందుకు ఉలుకు అని నిలదీశారు.