హైదరాబాద్కు ధీటుగా విశాఖ: బాబు, మెట్రో తోపాటు..
విశాఖపట్నం: హైదరాబాద్ నగరానికి ధీటుగా విశాఖపట్నంను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నానికి శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ పర్యటక, చలనచిత్ర, ఐటిలకు ముఖ్య కేంద్రంగా ఎదుగుతుందని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి విశాఖపట్నంకు అవకాశాలున్నాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖ నగరానకి ప్రపంచంలోని ఉన్నత పరిశ్రమలను తీసుకొస్తామని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం కాకుండా గతంలో అడ్డుకుంది తెలుగుదేశం పార్టీనేని ఆయన చెప్పారు. ఉక్కు పరిశ్రమ సామర్థ్యం 10 మిలియన్ టన్నులకు తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా గాజువాక హౌస్ కమిటీ బాధితులు చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు.
హౌస్ కమిటీ భూముల సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట మంత్రులు గంటా శ్రీనివాస రావు, అచ్చెన్నాయుడు, అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్, ఇతర నాయకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications