ఏమిటీ కాల్ మనీ?, బిజినెస్లో ఎన్నారైలు: కాలువల్లోకి బ్లూఫిలింలు, పత్రాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ సంచలనం సృష్టిస్తోంది. బాధితులు పోలీసు స్టేషన్కు వరుస కడుతున్నారు. కాల్ మనీ బాధితుల నుంచి నిర్వాహకులు బలవంతంగా భూములు లాక్కోవడం, డబ్బులు తీసుకోవడం, అధిక వడ్డీని వసూలు చేయడం వెలుగు చూస్తున్నాయి.
మరో షాకింగ్ విషయమేమంటే, మహిళా బాధితులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో 'కాల్ మనీ' సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. డబ్బులు అవసరమైన వారికి 'కాల్ మనీ' ద్వారా సులభంగా వడ్డీకి డబ్బులు పొందవచ్చు.
ఓ కాల్ ద్వారా డబ్బును సులభంగా పొందవచ్చు. డబ్బులు ఇచ్చే 'కాల్ మనీ' నిర్వాహకుడు డబ్బులు, ప్రామిసరీ నోటు, ఇతర అవసరమైన పత్రాలతో ఇంటికి వచ్చి ఇస్తాడు. తక్షణమే రుణం పొందే పద్ధతి 'కాల్ మనీ'. ఈ పద్ధతిలో వడ్డీ 120 శాతం నుంచి 200 శాతం వరకు ఉంటుంది.
రుణం ఇచ్చిన 'కాల్ మనీ' నిర్వాహకుడు అప్పు తీసుకున్న వ్యక్తిని ఎప్పుడైనా, ఎక్కడైనా డబ్బులు అడగవచ్చు. అప్పులు తీసుకున్న వ్యక్తి వెంటనే చెల్లించలేని పరిస్థితి ఉంటే.. ఆయనకు చెందిన వాహనాలు, ఇతర ఖరీదైన స్థిర, చర ఆస్తులను గ్యారంటీ కోసం డిమాండ్ చేస్తాడు.
'కాల్ మనీ' నుంచి పురుషులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఇవ్వని మహిళలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. వారిని బెదిరించి, లొంగదీసుకొని, వాటిని వీడియోగా తీసి, బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు.
విజయవాడలో దాదాపు రూ.600 కోట్ల మేర కాల్ మనీ దందా సాగుతోందని తెలుస్తోంది. ఓ ఫిర్యాదు నేపథ్యంలో.. పోలీసుల చర్యలతో కాల్ మనీ దందా వెలుగు చూసింది. రూ.ఒక లక్ష అప్పు తీసుకున్న వారు రూ.తొమ్మిది లక్షల వరకు చెల్లిస్తున్న ఘటనలు ఉన్నాయి.

సిట్కు అప్పగింత
బెజవాడలో కలకలం రేపుతున్న కాల్ మనీ పునాదులు కదులుతున్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తూ పత్రాలు, నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. కేసును సిట్కు అప్పగించే యోచనలో పోలీసులు ఉన్నారు. కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
కాల్ మనీ కేసులో షకీలా అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 40కి పైగా ఫిర్యాదులు అందాయి. కాల్ మనీ దందాలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, పోలీసులతో పాటు ఎన్నారైలు కూడా పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎవరినీ వదలం: డిజిపి
కాల్ మనీ ఘటనలో నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదని డిజిపి జేవీ రాముడు చెప్పారు. రుణం తీసుకున్న వారిని వేధిస్తే చర్యలు తప్పవన్నారు. అప్పు ఇచ్చి, తీర్చనందుకు లాడ్జీకి వస్తావా అని పిలిస్తే ఎంత ఘోరం, ఇలాంటి కేసులో ఎవర్నీ వదిలేది లేదన్నారు.
కాల్ మనీ ఘటనపై అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. బాధితులను బెదిరిస్తే పిడి యాక్టు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రుణం తీసుకున్న వారి పైన అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో అన్ని చోట్ల తాము తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్కు నెల రోజుల క్రితమే సెలవు ఇచ్చామన్నారు. ఆయనకు హడావుడిగా ఇచ్చింది కాదన్నారు. ఆయన స్థానంలో సురేంద్ర బాబు సిపిగా విధులు నిర్వహిస్తారని చెప్పారు.
కాలువల్లో వీడియోలు, కండోమ్లు
కాల్ మనీ ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నిర్వాహకులు దస్త్రాలు, బ్లూఫిలిం వీడియోలు, కండోంలను మురికి కాలువల్లోకి విసిరేస్తున్నారు. పోలీసుల దాడుల నుంచి కాపాడుకునేందుకు వారు పడేస్తున్నారు.












Click it and Unblock the Notifications