అప్పుడే సూత్రధారి తేలుతుంది: మేకపాటి, షర్మిల-విజయమ్మలపై ఆరోపణ.. పీఎస్లో ఫిర్యాదు
ఉయ్యూరు/అమరావతి: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్కు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారంఅన్నారు.

బతికి ఉంటే సూత్రధారులు తెలుస్తారు
శ్రీనివాస రావు బతికి ఉంటే ఎప్పటికైనా వాస్తవాలు బయటకు వస్తాయని మేకపాటి చెప్పారు. అతను మాత్రం తనకు ప్రాణహానీ ఉందని చెప్పాడని, అయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. జగన్ పైన దాడి చేసింది శ్రీనివాస రావు అయినా, ఈ దాడి వెనుక సూత్రధారులు ఎవరో తేలాలని చెప్పారు.

విజయమ్మ, షర్మిలలపై చేసిన వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్పై ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పైన కృష్ణా జిల్లా ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జగన్ పైన జరిగిన హత్యాయత్నంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిలలపై చేసిన వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

విజయమ్మ, షర్మిలలపై ఆరోపణలు, వైసీపీ సీరియస్
జగన్ పైన హత్యాయత్నం, విజయమ్మ, షర్మిలలపై టీడీపీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, శ్రీనివాస రావు ఆరోగ్యంపై వైసీపీ సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, జగన్పై జరిగిన దాడిలో అతనికి అయిన గాయం చిన్నదేనని డాక్టర్లు మంగళవారం తేల్చారు. హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు గాయాలకు సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేశారు. జగన్ గాయాలకు సంబంధించిన సర్టిఫికేట్ను పోలీసులు కోరగా ఆసుపత్రి వర్గాలు జారీ చేశాయి. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి దానిని పోలీసులకు అందించింది.

జగన్ గాయం చిన్నదేనని సర్టిఫికేట్
అందులో.. జగన్ 18002386 ఇన్పేషంట్ నెంబరుతో ఈ నెల 25.10.2018 మధ్యాహ్నం 3.45 గంటలకు సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారని, 26.10.2018 మధ్యాహ్నం 12.54 గంటలకు డిశ్చార్జ్ అయ్యారని, ఈ మెడికో లీగల్ కేసులో నిర్వహించిన వైద్య పరీక్షల ప్రకారం అయనకైన గాయం స్వభావం చిన్నదేనని పేర్కొన్నారు. ఈ వివరాలు ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications