వీళ్లంతా KCRతో కలవడానికి సిద్ధంగా ఉన్నవారే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులమీద, ఇక్కడి ప్రజల మీద తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు గొప్ప నమ్మకం ఉంది. కచ్చితంగా ఏపీకి చెందిన నేతలు పలువురు తనతో నడుస్తారని. వాస్తవానికి కేసీఆర్ నమ్మకం గట్టిది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నాన్ని నిరసించింది ఆంధ్ర ప్రజలే. ఆ తర్వాత ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. విడిపోయిన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. దీనంతటికీ కారణం ఆంధ్రులే.

తిట్లను నాయకులు మరిచిపోయారుకానీ ప్రజలు మరిచిపోలేదు!!
ప్రతి సభలో ఆంధ్రులను దారుణంగా తిట్టారు. ఆ తిట్లను ఇంతవరకు ప్రజలు మరిచిపోలేదు. తాను రాజకీయంగా ఎక్కడ బలహీనపడుతున్నానో అనుకున్నప్పుడల్లా తెలంగాణ ప్రజలను వంచిస్తూ ఏపీ ప్రజలపై వారిలో విద్వేషాలను రగిల్చేవారు. ఆ విద్వేషాన్ని, ఆ తిట్లను, ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు జరిగిన సంఘటనలను
రాజకీయ నాయకులు మరిచిపోయారుకానీ ప్రజలు మాత్రం మరవలేదని కేసీఆర్ కు తెలుసు. అందుకే ఆయన ఇక్కడి నాయకులపై తన రాష్ట్రంలోకన్నా ఎక్కువ నమ్మకాన్ని ఉంచుతున్నారు.

కులం, ధనం ఆలోచించేవారే కావాలంటున్నారు..?
కేవలం స్వార్థాన్ని మాత్రమే నమ్ముకున్నవారు, కులం అంటే విపరీతమైన అభిమానం చూపేవారు, ధనమే పరమావధిగా రాజకీయాల్లోకి ప్రవేశించేవారిపై ఆధారపడితే తనకు ఏపీలో కూడా 25 లోక్ సభ సీట్లకు కనీసం 10 సీట్లయినా వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు కేసీఆర్ పీఠం పదిలింగా ఉందంటే కారణం ఆంధ్రులే. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలువురు సీనియర్ నేతలకు రాష్ట్రం విడిపోవడం ఖాయం.. అని తెలుసు. రాష్ట్రానికేం కావాలో కోరుకోమని సోనియాగాంధీ చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కానీ వారంతా ఇక్కడి ప్రజలకు ఏం కావాలో చెప్పకుండా విజయవాడ, గుంటూరు వచ్చి నానా యాగీ చేసి జై సమైక్యాంధ్ర అంటూ ఇక్కడి ఉద్యమాల్లో పాల్గొనేవారు. విభజన ఖాయమైందని తెలిసినా విభజిస్తే ఏమేం కావాలో కూడా కోరుకోలేదు. ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఒకటి వచ్చినా దానికి మంచినీటి సమస్య ఎదురవుతోంది.

కాంగ్రెస్ కన్నా బీజేపీనే ఎక్కువ నష్టం చేస్తోంది!!
విభజనకు వంతపాడిన బీజేపీ నేతలే ఇంకా ఎక్కువ నష్టం చేకూరుస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇక్కడి ప్రజలను కేసీఆర్ ప్రత్యక్షంగా తిడితే, ఇక్కడి నాయకులు మాత్రం పరోక్షంగా నష్టం చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేతావులు అప్పుడప్పుడూ మాట్లాడుతున్నారుకానీ విభజన సమయంలో ఎందుకు మాట్లాడలేదని ప్రజలు అడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ రాజకీయ నేతల లక్షణాలున లక్షల సంఖ్యలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రజల అభిప్రాయంతో పనిలేకుండా ఉండే రాజకీయ నిరుద్యోగులంతా కేసీఆర్ పార్టీలో చేరి ఇక్కడి ప్రజల్లో కుల, మత, ప్రాంతీయ భేదాలు తెచ్చేలా వ్యాఖ్యానించి పబ్బం గడుపుకోవడానికి సిద్ధమయ్యారు. అంతిమంగా ప్రజలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.!!












Click it and Unblock the Notifications