జగన్ ఇంట్లో ఎందుకు ఐటీ దాడులు నిర్వహించడం లేదు.. దాడులకు భయపడే ప్రసక్తే లేదన్న టీడిపి నేతలు..
హైదరాబాద్ : ఐటీ దాడులపై ఏపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. ఎవరి ఆదేశాలతో సీఎం రమేశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని ఆయన మండిపడ్డారు. సాధారణ తనిఖీలేనంటున్న పోలీసులు అదే జిల్లాలోని జగన్, అవినాశ్ రెడ్డి, మిథున్రెడ్డి ఇళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణ దాడులైతే అన్ని పార్టీల అభ్యర్థుల ఇళ్లపై చేయాలే గానీ ఒకే పక్షం అభ్యర్థులపై ఎందుకు నిర్వహిస్తున్నారని అని ప్రశ్నించారు.
ఇటీవల ఉగ్రనరసింహరెడ్డి, బీద మస్తాన్రావు, పుట్టా సుధాకర్ యాదవ్ ఇళ్లపైనా దాడులు చేశారని.. వీటిని ఏ కోణంలో చూడాలని ప్రశ్నించారు. ఇందులో కచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందని తేల్చి చెప్పారు. వైసీపీలోనూ నేరస్థులు చాలా మంది ఉండగా.. రకరకాల వ్యాపారాలు చేస్తున్న వారిపై ఐటీ దాడులు ఎందుకు జరపడం లేదని ధ్వజమెత్తారు.

ఈ ధోరణి ఓటర్లకు ప్రత్యక్షంగా సంకేతాలు పంపడమేనని అన్నారు. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే ఐటీ అధికారులను ప్రశ్నించాల్సి ఉందని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ఇటు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ఏపి టీడిపి నేతలపై జరుగుతున్నదాడులను తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications